ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ప్రక్రియ కోసం ప్రజలెవరూ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు దరఖాస్తులకు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. చాలా మంది వదంతులను నమ్మి అనవసరంగా ఇతరత్రా ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏదైనా ధ్రువీకరణ పత్రాలు అవసరమైతే ప్రభుత్వమే ముందస్తుగా అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నారు. మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీపై సీరియస్గా దృష్టి సారిస్తామని చెప్పారు. నిర్ణీత రుసుములనే తీసుకోవాలని, ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. ఇప్పటి వరకు స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ శుక్రవారం నుంచే ఆన్లైన్లోకి డాటా ఎంట్రీ ప్రారంభించినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీల్లో సభలు పూర్తి చేశామన్నారు. ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీలు, నిజామాబాద్ నగర పాలక సంస్థలన్నింటిలో కలిపి మొత్తం 146 డివిజన్/వార్డుల్లోనూ సభలను పూర్తి చేసినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు వివరించారు.
నమస్తే : కొత్త ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజాపాలన అభయహస్తం పథకాల దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది?
కలెక్టర్ : గత డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రజాపాలన అభయహస్తం పథకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. విజయవంతంగా దరఖాస్తుల స్వీకరణ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. జిల్లాలో 530 జీపీలు, మూడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 146 డివిజన్/వార్డుల్లో వేగంగా దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్నది. అన్నిచోట్ల ప్రభుత్వం ఆదేశించినట్లుగానే గ్రామ సభలు, వార్డు సభలను పూర్తి చేశాం. ప్రజలతో మమేకమై సభలు నిర్వహించాం. సభలకు విశేష స్పందన వచ్చింది. ప్రజల అభ్యంతరాలు, సలహాలు, సూచనలను నమోదు చేశాం.
కలెక్టర్: ఎల్పీజీ సిలిండర్ల కోసం ఈ -కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం చెప్పలేదు. అలాంటి అవసరమే రాదని నేను భావిస్తున్నా. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి ఎవ్వరూ ఆగం కావొద్దు. ఇకపోతే ఎల్పీజీ ఏజెన్సీల్లో ఈ-కేవైసీ పేరిట బహుమతులు అంటగట్టి డబ్బులు అదనంగా దండుకుంటున్నారని తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికే విచారణ చేయించాం. వినియోగదారుల ఇష్టపూర్వకంగానే సిలిండర్ పైప్లను ఇతరత్రా విక్రయించాలి. బలవంతంగా అంటగడితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో ఎల్పీజీ ఏజెన్సీ బాధ్యులతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించాం.
కలెక్టర్ : గతేడాది ఫిబ్రవరి ఒకటిన నిజామాబాద్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టాను. ఈ పదకొండు నెలల కాలంలో గత ప్రభుత్వ పథకాల అమలుతో పాటు కీలకమైన అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నాను. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా కృషి చేయడం సంతోషంగా ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయడం వరకు అన్ని సవ్యంగా జరిగాయి. ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా పోలింగ్ నిర్వహించగలిగాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల అనుభవం కాస్త ఈ ప్రాంతంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నా. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటరు జాబితా రూపకల్పనలో బిజీగా ఉన్నాం. జనవరి 6న ఓటరు జాబితా ముసాయిదా వెలువడుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ కేంద్రాన్ని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించాం. లోక్సభకు డిచ్పల్లి సీఎంసీలో కౌంటింగ్ చేపట్టబోతున్నాం.
కలెక్టర్ : వాస్తవానికి ఈ విషయం మా దృష్టికి రాలేదు. మీసేవల్లో వసూళ్లపై తప్పకుండా విచారణ చేపడతాం. ర్యాండమ్గా తనిఖీలకు ఆదేశాలిస్తా. ఒకవేళ ఎవరైనా నిర్ణీత రుసుము కాకుండా అదనంగా డబ్బులు డిమాండ్ చేసినట్లుగా మా దృష్టికి వస్తే మాత్రం వదిలేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా చైతన్యంగా ఉండాలి. మీ సేవల్లో ప్రభుత్వం నిర్దేశించిన రుసుములను మాత్రమే చెల్లించాలి. అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నాం.
కలెక్టర్: ముఖ్యంగా అన్ని వర్గాల వారు అర్హతలను అనుసరించి దరఖాస్తులు ఇస్తున్నారు. ఇందులో ఎక్కువగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అందించే రూ.2500 కోసం దరఖాస్తులు పెద్దసంఖ్యలో వచ్చినట్లు కనిపిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ రూ.500 స్కీమ్ కోసం కూడా దరఖాస్తుదారులు ఆసక్తిగా ఉన్నారు. 200 యూనిట్ ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లకు కూడా ప్రజలు దరఖాస్తు చేస్తున్నారు. ఒకే దరఖాస్తు ఫారంలో దరఖాస్తుదారుడు టిక్ చేసిన అంశాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. వారి ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులు తప్పకుండా జత చేస్తున్నాం. డాటా ఎంట్రీలో ఈ వివరాలన్నింటినీ పొందుపరుస్తాం. ఆన్లైన్ పోర్టల్లో అభయహస్తం పథకాలకు సంబంధించిన దరఖాస్తు డిస్ప్లే అవుతుంది. అందులోనే ఈ వివరాలన్నింటినీ నమోదుచేస్తాం.
కలెక్టర్ : ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయ, కుల ధ్రువీకరణకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లను అడగలేదు. దరఖాస్తులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జత చేస్తే సరిపోతుంది. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెప్పుడు మాటలు విని అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని నా సలహా. ఏమైనా అనుమానాలుంటే స్థానిక ఎంపీడీవోలు, తహసీల్దార్లను కలిస్తే వారు నివృత్తి చేస్తారు. ఇప్పుడైతే అలాంటి డాక్యుమెంట్లను మేము తీసుకోవడం లేదు. ఎవ్వరూ ఏ కౌంటర్లలోనూ అడగడం లేదు.
కలెక్టర్ : అలాంటిదేమీ ఉండదు. దరఖాస్తులను క్రమపద్ధతిలో ఆన్లైన్లో పొందుపర్చిన తర్వాత ప్రత్యేక సాఫ్ట్వేర్తో వివరాలను పోల్చి చూస్తారు. ఒకే ఇంటికి ఒకే దరఖాస్తు సరిపోతుంది. ఒకే దరఖాస్తులో అన్ని పథకాలకు సంబంధించిన ఆప్షన్లు ఉన్నాయి. ఒకవేళ ఎక్కువగా దరఖాస్తులు సమర్పించినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా కుటుంబాల్లో ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి జీవనం సాగిస్తున్న వారే ప్రత్యేకంగా దరఖాస్తులు అందించారు. నిజామాబాద్లో దాదాపుగా 4లక్షల 5వేల కుటుంబాలుంటే ఇందులో ఇప్పటికే 4లక్షల 2వేల దరఖాస్తులు వచ్చాయి. శనివారం పూర్తి స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.