నిజామాబాద్ క్రైం/ఇందూరు/ ఖలీల్వాడి, మే 19: ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించాలనే అంశంపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సు (కొలువు..గెలువు) విజయవంతమైంది. ఈ సదస్సును జిల్లా పోలీసుశాఖ, టీఎన్జీ వోస్, శ్రీ విష్ణు సూపర్స్పెషాలిటీ దవాఖాన సౌజ న్యంతో నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు నిర్వహించిన ఈ సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగార్థులు హాజరయ్యారు.
పోటీ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి తదితర అంశాలపై పలువురు వక్తలు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. క్రిప్టో కరెన్సీ, సైబర్ సెక్యూరిటీస్, పెగాసస్ స్పైవేర్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ అంశాలు, స్విఫ్ట్ బ్యాంకింగ్, రూపాయి విలువ హెచ్చుతగ్గులు, ఈరూపి, నాటో, ఓపెక్, ప్రపంచవ్యాప్త వివాదాస్పద ప్రాంతాలు, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, శ్రీలంకలో తాజా పరిస్థితి, జీ-20 ఇండియా సదస్సు, పారా బాయిల్డ్ రైస్ తదితర అంశాలపై సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ, డైరెక్టర్ మల్లవరపు బాలలత అవగాహన కల్పించారు.
ప్రముఖుల సలహాలు, సూచనలతో పాటు ఉద్యోగం సాధించేందుకు ఉపయోగపడే ప్రతి అంశాన్నీ అభ్యర్థులు శ్రద్ధగా విన్నారు. ఫ్యాకల్టీలు చెప్పిన ప్రతి అంశాన్నీ పుస్తకాలు, డైరీల్లో నోట్ చేసుకున్నారు. కొందరు తమ సెల్ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. ఉద్యోగార్థులతో ఆడిటోరియం నిండిపోగా కొందరు నిలబడే విన్నారు. కొందరు మహిళా అభ్యర్థులు వారి భర్తలు, తల్లిదండ్రులతో దూరప్రాంతాల నుంచి తరలివచ్చారు. మరికొందరు చంటి పిల్లలతో వచ్చి అవగాహన సదస్సు ముగిసే వరకూ శ్రద్ధగా విన్నారు.
ప్రభుత్వం ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడే స్టడీ మెటీరియల్ సూచనలతో పాటు ఎలా ప్రిపేర్ కావాలనే అంశాలను తమకు క్షుణంగా వివరించినందుకు ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యానికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ఉద్యోగార్థులు పేర్కొన్నారు. వక్తలు, ఫ్యాకల్టీలు సూచించిన మెళకువలను పాటించి ఉద్యోగాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖకవి ఘనపురం దేవేందర్ సదస్సులో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నమస్తే తెలంగాణ చీఫ్ ఆఫ్ బ్యూరో ఓరుగంటి సతీశ్, తెలంగాణ పబ్లికేషన్స్ మే నేజర్ టి. గణేశ్, ఎడిషన్ ఇన్చార్జి ఎల్.రమేశ్, బ్యూరో ఇన్చార్జి జూపల్లి రమేశ్, ప్రకటనల విభాగం మేనేజర్ శ్రీకాంత్, సర్క్యులేషన్ ఇన్చార్జి నాగస్వామి రెడ్డి, డీసీపీ వినీత్, ఏసీపీ వెంకటేశ్వర్లు, నమస్తే తెలంగాణ సిబ్బంది పాల్గొన్నారు.
మైండ్ను పాజిటివ్గా ఉంచాలి..
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ మైండ్ను పాజిటివ్గా ఉంచుకోవాలి. ఇందుకోసం బ్రెయిన్కు పాజిటివ్ సందేశాలనే ఇవ్వాలి.
అప్పుడు పరీక్షల సన్నద్ధతలో మనస్సు పాజిటివ్ దృక్పథంతో ఉంటుంది.అభ్యర్థులు ప్రిపరేషన్ కాలమంతా మంచి ఆహారం తీసుకోవాలి.శాకాహారం తీసుకుంటే మంచిది. ఆరెంజ్, నట్స్ లాంటివి తీసుకుంటే బాగుంటుంది. మాంసాహారంలో చేపలు, గుడ్లు వంటివి మంచివి. సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మైండ్, బాడీ ఉత్సాహంగా ఉండేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.
– రాజేంద్రప్రసాద్, ప్రముఖ వైద్యుడు
స్థానికతను సద్వినియోగం చేసుకోవాలి…
జోనల్లో 95 శాతం ఉద్యోగాలను స్థానికులకే దక్కేలా కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన మార్పులు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సమయంలో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా అవకాశం కల్పించింది. జోనల్లో 95 శాతం ఉద్యోగాలు జిల్లా అభ్యర్థులు సాధించాలి. బాసర జోన్లో నిజామాబాద్ జిల్లా బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నాం. ఉద్యోగార్థుల కోసం ‘నమస్తే తెలంగాణ’ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయి.
– అలుక కిషన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు
సదస్సుకు రాకపోతే ఎంతో నష్టపోయేదాన్ని
అవగాహన సదస్సుకు రాకపోతే ఎంతో నష్టపోయేదాన్ని. ఇంటి వద్ద ఉండి చదువుకుందాం అనుకున్నా… బాలలత మేడం వస్తుందని తెలిసి పాపతో పాటు అవగాహన సదస్సుకు వచ్చాను. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తప్పక ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం కలిగింది. బాలలత మేడం లాంటి వారిని ఇక్కడికి రప్పించి సదస్సు నిర్వహించినందుకు ‘నమస్తే తెలంగాణ’కు రుణ పడి ఉంటాను.
-నాగమణి
ఏం చదవాలో.. ఎలా చదవాలో నేర్పించారు.
సదస్సులో ఏం చదవాలో ఎలా చదవాలో అవగాహన కల్పించారు. సదస్సుతో క్లారిటీ వచ్చింది. ఇక నుంచి వారు చెప్పిన విధంగా కష్టపడి చదివి కొలువు గెలువు అన్నట్లు గెలిచి చూపిస్తా. ఇంతటి చక్కని సదస్సు నిర్వహించినందుకు ‘నమస్తే తెలంగాణ’కు థ్యాంక్స్.
-స్వాతి, నిజామాబాద్
ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం కుదిరింది
ఉద్యోగం సాధించాలంటే పుస్తకాలతో పాటు ఇలాంటి వారి దగ్గర ఎన్నో తెలియని విషయాలను తెలుసుకున్నాను. ముఖ్యంగా సమయాన్ని వినియోగించుకోవడం అంటే ఏంటో తెలిసింది. ఎంత చదివినా పరీక్షలో ఎలా రాయాలో తెలిపిన టిప్స్ బాగున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు ఎలా గుర్తుంచుకోవాలో తెలిపారు.
-శ్వేత, నిజామాబాద్
సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో వివరించారు
సమయం ఎంతో విలువైనది. పరీక్షా సమయం అందరికీ సమానంగా ఉన్నా కొందరే విజయం సాధిస్తారు. అలా ఎందుకు విజ యం సాధిస్తారో టైం మేనేజ్మెంట్ గురించి చక్కటి విశ్లేషణ ఇచ్చారు. సమయం గొప్పతనం వివరించారు.
-శ్రీవిద్య, నిజామాబాద్
చదివినవి గుర్తుంచుకునే టిప్స్ బాగున్నాయి..
ఎంత చదివినా గుర్తుండకపోతే లాభం లేదు. ఎం త చదివామనేది కా కుం డా పరీక్ష ఎలా రాశాం అన్నది ము ఖ్యం. మెదడుకు చేసే ఎక్సర్సైజ్ల గురించి వేప అకాడమీ డైరెక్టర్, ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత వివరించారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ చేతులతో చేసే టిప్స్, మెదడును ఎలా షార్ప్ చేసుకోవాలి… ఎలా ఉపయోగించుకోవాలో చక్కని ఉదాహరణలు ఇచ్చారు.
-నవ్య, ఆర్మూర్
స్వప్న : గ్రూప్స్ సాధించాలంటే ఎలా ప్రిపేర్ కావాలి?
బాలలత : సిలబస్పై పట్టు పెంచుకోవాలి. సిలబస్ ప్రకారం చదివితే సమయాన్ని వృథా చేసుకోకుండా కాపాడుకోగలుగుతాం. కరెంట్ ఎఫైర్స్, తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్రపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. గ్రూప్స్లో లోతుగా సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. తెలంగాణపై రాసిన ఆర్టికల్స్ను పరిశీలించాలి.
సునీల్ : ఒకటో తరగతి నుంచి బోనాఫైడ్ తప్పని సరిగా కావాల్సిందేనా?
బాలలత : ఈ సమస్యపై టీఎస్పీఎస్సీ వాళ్లతో మాట్లాడుతాను. మీ తరఫున వారికి సమస్యను ప్రస్తావిస్తాను. ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారన్న వివరాలు అవసరమే. ముందుగా శ్రద్ధతో చదువుకుని ఉద్యోగం కొట్టండి. ప్రభుత్వం చక్కని పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నా.
ప్రసన్న : గ్రూప్-1 మెయిన్స్లో స్కోర్ చేయాలంటే ఏ పుస్తకాలు చదవాలి?
బాలలత : ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ పుస్తకాలను అవపోసన పట్టాలి. ప్రిలిమ్స్, మెయిన్స్కు ప్రిపరేషన్ చాలా తేడా ఉంటుంది. మెయిన్స్లో లోతుగా అధ్యయనం చేసి గణాంకాలతో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని అంశాలపై పట్టు సాధించాలి. ప్రామాణికత ఉన్న పుస్తకాలను కొని చదివితే సరిపోతుంది. అనేకానేక పుస్తకాలు కొని తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు.
అనిల్గౌడ్ : రోజుకు ఎన్ని సబ్జెక్టులు చదవాలి?
బాలలత : రోజుకు మూడు సబ్జెక్టులను సమయ పట్టిక ఆధారంగా చదువుకోవచ్చు. దీనికి ప్రణాళిక అవసరం. చదివిన విషయాలను ఏ రోజుకు ఆరోజు మననం చేయాలి. తద్వారా సబ్జెక్టులపై పట్టు వస్తుంది. ఎగ్జామ్లో సులువుగా జవాబులు రాసేందుకు ఆస్కారం ఉంటుంది.