రెంజల్, డిసెంబర్31: ‘దరఖాస్తు చాటున దోపిడీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దరఖాస్తుల కొరత అంశాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు గాను పట్టణంతో పాటు, గ్రామాల వారీగా అర్జీల స్వీకరణకు గాను కౌంటర్లను డిసెంబర్ 28 నుంచి నిర్వహిస్తోంది. ప్రతి కుటుంబం నుంచి అర్జీల స్వీకరణకు ప్రభుత్వం దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచింది. రెండో రోజు నుంచే ఫారాల కొరత ఏర్పడడంతో పలువురు జిరాక్స్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలను ఆశ్రయించారు. వారు ఒక్కో దరఖాస్తును రూ. 40 నుంచి రూ.50 వరకు విక్రయించారు. ఈనెల 30న రెంజల్ మండలంలోని సాటాపూర్లో నిర్వహించిన గ్రామసభలో అర్జీ ఫారాలు కొరత కారణంగా సభ అర్ధాంతరంగా ముగిసింది. ఫారాలు అందుబాటులో లేక అధికారులు సభ నుంచి వెళ్లిపోయారు.
ఈనెల 2నుంచి కొనసాగే గ్రామసభల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచుతామని ఎంపీడీవో శంకర్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అర్హులైన వారందరూ ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు స్వీకరించి, పూర్తి వివరాలతో ఈనెల 6వ తేదీలోగా అందజేయాలని సూచించారు.