ఆర్మూర్టౌన్, మార్చి 21: బీఆర్ఎస్ పాలనలో మత సామరస్యం వెల్లివిరిసిందని, మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేలా నిధుల కేటాయింపులు జరిగాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. శనివారం ఆర్మూర్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం జీవన్రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిఖార్సయిన హిందువు, సకల మతాలకు బంధువు అని పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్దని, రేవంత్ పాలనలో మైనార్టీలకు చీకటి రోజులు వచ్చాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన షాదీముబారక్ సాయం రూ.లక్షకు తోడు తులం బంగారం కలిపి ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పిన రేవంత్రెడ్డి.. షాదీ ముబారక్ సాయం ఇవ్వడానికీ తటపటాయిస్తున్నారని విమర్శించారు.
మైనారిటీ యువతకు, మహిళలకు సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని మాయమాటలు చెప్పి, కనీసం రూ.10 కోట్లు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 9న ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. మైనార్టీలకు సబ్ప్లాన్ ఏర్పాటు చేసి, బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మైనార్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం, ఇమామ్, మౌజంలకు గౌరవ వేతనం పెంపు వంటి హామీలు అమలు చేయలేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మైనార్టీలకు పెద్దపీట వేశారని జీవన్రెడ్డి అన్నారు. మైనార్టీ నేత మహమూద్ అలీని ఉప ముఖ్యమంత్రిని, హోం మంత్రిని చేసింది కేసీఆరేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు కాగా, ఇప్పుడు కనీసం షాదీముబారక్ చెక్కులు కూడా అందడం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న సీఎం రేవంత్ ఉద్దేశపూర్వకంగానే మైనారిటీలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన రంజాన్ తోఫాను సీఎం రేవంత్ పేదలకు దూరం చేశారన్నారు. ఇప్పటికైనా రేవంత్ కండ్లు తెరిచి మైనారిటీ సంక్షేమంపై దృష్టిపెట్టాలని, లేకపోతే మైనారిటీలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.