వేల్పూర్/బాల్కొండ, నవంబర్ 24: నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వేల్పూర్ మండలంలోని అమీనాపూర్, లక్కోర, బాల్కొండ పట్టణంతో పాటు శ్రీరాంపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో మాట్లాడారు. కాళేశ్వరం నీటిని పోచంపాడ్లో నింపడంతో గుత్ప నవాబు ఎత్తిపోతలకు నీటి కొరత లేకుండా చేశానన్నారు. ఈ ఎత్తిపోతలకు నీటి కొరత లేకుండా పోవడంతో లక్కోర, అమీనాపూర్ గ్రామాల్లో చెరువులకు సైతం నీటి ఢోకా లేకుండా పోయిందన్నారు. ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా ఏప్రిల్లో కూడా చెరువులను నింపినట్లు తెలిపారు. కుల సంఘ భవనాలకు సీఎం ప్రత్యేక నిధులు తెచ్చినట్లు చెప్పారు. ఈ ప్రొసీడింగ్లు వట్టి కాగితాలని, కొందరు దిగజారి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవి వట్టి కాగితాలు కాదని, గట్టి కాగితాలని పేర్కొన్నారు. కుల సంఘ భవనాలు, గృహలక్ష్మి ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టుకోవచ్చని సూచించారు.
బిల్లులు తప్పకుండా వస్తాయని అందుకు తనదే జిమ్మేదార్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు సగానికి పైగా పైరవీకారుల పాలయ్యాయని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో కూడా పింఛన్లు, రైతుబంధు ఆపకుండా ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని తెలిపారు. బాల్కొండ అప్పుడెట్లుం డేది.. తాను, కేసిఆర్ వచ్చాక ఇప్పుడెట్ల మారింది.. ఈ అభివృద్ధిని చూసి మరోసారి తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మూడు డిగ్రీ కాలేజీలు, రెండు ఫైర్ స్టేషన్లు రాష్ట్రంలో బాల్కొండ నియోజక వర్గంలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. కండ్ల ముందున్న అభివృద్ధి ఎవరి వల్ల జరిగింది..ఎవరికి ఓటు వస్తే న్యాయంగా ఉంటుందని అనే విషయాలు మనసు పెట్టి ఆలోచించాలని వేముల కోరారు.
బాల్కొండ, నవంబర్ 24 : కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బాల్కొండ మండల కేంద్రంలోని మదీనా కాలనీలో మైనార్టీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు. మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యనభ్యసించడానికి గురుకుల పాఠశాలు, కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చే ప్రభుత్వంలో మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి మరింత కృషి చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో అండగా ఉండాలని మైనార్టీలను ఆయన కోరారు.