హైడ్రా సృష్టించిన విధ్వంసం, అధికారం ముసుగులో అరాచకం.. హైకోర్టుకు ఆగ్రహాన్ని తెప్పిస్తూనే ఉన్నాయి. ఇప్పట్లో ఈ మందలింపుల పరంపర, ఉల్లంఘనల లెక్కింపు ఆగేలా లేదు. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడిన రంగనాథ్ను హైడ్రా కమిషనర్గా తక్షణమే తొలగించాలని సోమవారం జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం ఆదేశించగా.. తాజాగా మరో రెండు ఉదంతాల్లోనూ న్యాయస్థానం అధికారుల తీరుపై మండిపడింది. ప్రైవేట్ జాగల్లోకి చొరబడి.. బోర్డులు పాతడం, గోడ కూల్చాలని నిర్ణయించడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ కొండాపూర్లోని సర్వే నంబర్ 60లో ప్రైవేట్ స్థలంలోని కాంపౌండ్ గోడను కూల్చివేయాలంటూ హైడ్రాకు ఏ ఆధారాలతో లేఖ రాశారని శేరిలింగంపల్లి తహసీల్దార్ను హైకోర్టు నిలదీసింది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వ్యవస్థాపరమైన వైఫల్యమని వ్యాఖ్యానించింది. నోటీసు ఇవ్వకుండా, వివరణకు అవకాశం కల్పించకుండా కూల్చివేతలకు దిగడంపై హైడ్రాతో పాటు తహసీల్దార్ వ్యవహారాన్ని తప్పుబట్టింది. కొండాపూర్లోని 350 చదరపు గజాల ప్లాటుకు చెందిన కాంపౌండ్ గోడ, వాచ్మన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ పెమ్మసాని సుధారాణి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్ శ్రీధర్ వాదిస్తూ, స్థలాన్ని రిజిస్టర్ సేల్డీడ్ ద్వారా కొనుగోలు చేశారని, ప్రభుత్వం క్రమబద్ధీకరణ ఉత్తర్వులు కూడా జారీ చేసిందని తెలిపారు. గతంలో ఇదే అంశంపై హైకోర్టు సర్వే నం.59 ప్రభుత్వ భూమి అని, సర్వే నం.60 పట్టా భూమి అని స్పష్టం చేస్తూ, ఏ చర్య తీసుకున్నా ముందుగా నోటీసులు జారీచేసి చట్టప్రకారం వ్యవహరించాలని ఆదేశించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్ ఇచ్చిన సమాచారంపై చర్యలు తీసుకున్నామని హైడ్రా తరఫు న్యాయవాది తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపట్టారని హైడ్రాను ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ భూమిగా పేరొంటూ హైడ్రాకు సమాచారం ఎందుకు ఇచ్చారో ఈ నెల 30న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.