బోధన్ రూరల్, డిసెంబర్ 29: ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులను చేయాలని ప్రభుత్వం సూచిస్తుంటే వైద్య సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిన్నారని ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్ మండిపడ్డారు. గురువారం బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా సమావేశంలో చర్చించారు.
సాలూరా పీహెచ్సీలో కాన్పులు జరిగేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించినా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంపీపీ మండిపడ్డారు. పోలీస్ ఈవెంట్స్లో క్వాలిఫై అయిన ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్తోపాటు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ అధికారి తెలిపారు. హున్సా గ్రామంలో రైతు వేదికను నల్లరేగడి భూమిలో నిర్మించడంతో గోడలకు పగుళ్లు వస్తున్నాయని, గ్రామానికి దూరంగా ఉండడంతో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలకు అనుకూలంగా మారిందని హున్సా సొసైటీ చైర్మన్ బుచ్చల్వార్ రవి అన్నారు.
రైతు వేదిక చుట్టూ ప్రహరీ నిర్మించాలని కోరారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా బోధన్ మండలంలో చేసిన పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయి, ఇంకా ఏ పనులను మిగిలి ఉన్నాయని వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి పీఆర్ ఏఈ సాయిలును అడిగారు. దీంతో పీఆర్ ఏఈ మాట్లాడుతూ మండలంలోని ఇప్పటి వరకు మన ఊరు-మన బడి పనులు 40 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామనని అన్నారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని ప్రజాప్రతినిధులు అన్నారు. దీంతో తహసీల్దార్ వరప్రసాద్ మాట్లాడుతూ వచ్చే నెల సరఫరా చేసే బియ్యంలో పురుగులు రాకుండా చూస్తామన్నారు. రైతు బంధు డబ్బులను విడుదల చేసిన సీఎం కేసీఆర్కు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో బోధన్ ఎంపీడీవో మధుకర్, వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, తహసీల్దార్లు వరప్రసాద్, మమత, సీడీపీవో జానకి, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.