ఉమ్మడి జిల్లాలోని రైలు మార్గాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కరోనా కారణంగా రద్దు చేసిన పాత రైళ్లను పునరుద్ధ రించడానికి, కొత్త రైళ్లను నడపడానికి నిరాసక్తత చూపుతున్నది. ప్రధానంగా బోధన్ రైల్వే మార్గంపై కేంద్రం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. ఈ మార్గంలో సరుకు రవాణాతో దండిగా ఆదాయం ఆర్జిస్తున్న రైల్వే శాఖ.. ప్రజా రవాణాను గాలికొదిలేసింది. బోధన్-మిర్జాపల్లి రైలును పునరుద్ధరించలేదు. రాయలసీమ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదనా కార్యరూపం దాల్చలేదు. బోధన్-మహబూబ్నగర్ రైలు అనువు గాని సమయంలో వస్తుండడంతో పెద్దగా ప్రయోజనం లేదు. మరోవైపు శక్కర్నగర్, ఎడపల్లి రైల్వే స్టేషన్ల మూసివేతపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తన నియోజకవర్గ పరిధిలో రెండు స్టేషన్లను మూసేసినా, రైలు సర్వీసులను పునరుద్ధరించక పోయినా ఎంపీ అర్వింద్ పట్టించుకోవట్లేదు. కొత్త రైళ్లు కావాలని ఏనాడూ కేంద్రాన్ని అడగలేదు. ఈ నేపథ్యంలో బోధన్ మార్గంలోని రైల్వే సమస్యల పరిష్కారానికి రైల్వే జేఏసీ ఆందోళనలకు సిద్ధమవుతున్నది.
బోధన్, మే 28: బోధన్ రైల్వేస్టేషన్ నుంచి గూడ్స్ వ్యాగన్ల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైల్వేశాఖ ఈ ప్రాంత ప్రయాణికుల రవాణా, రైల్వేస్టేషన్ల ఆధునీకరణపై మాత్రం అంతులేని నిర్లక్ష్యాన్ని చూపుతున్నది. నిజాంకాలంలో ప్రారంభమైన బోధన్ రైల్వేమార్గంలో ప్రయాణికుల రైళ్లను క్రమంగా రద్దుచేయడంతో.. గత రెండేండ్లుగా బోధన్ నుంచి ఒక్కటంటే ఒక్క రైలు కూడా లేకపోవడం గమనార్హం. అంతేకాదు.. గత నెల 26న బోధన్ – మహబూబ్నగర్ రైలును పునరుద్ధరించడం కేవలం కంటితుడుపుగానే మిగిలిపోయింది. గతంలో రద్దయిన బోధన్ -మిర్జాపల్లి రైలును ఇప్పటికీ పునరుద్ధరించలేదు. రాయలసీమ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. నిజాంకాలంలో వైభవాన్ని చూసిన శక్కర్నగర్, ఎడపల్లి రైల్వేస్టేషన్లను ఏడాది కిందట రైల్వేశాఖ మూసివేసింది. ఎప్పుడో నిర్మించిన రైల్వేస్టేషన్లను మూసివేయడం, అవసరాల మేరకు రైళ్లను నడపకపోవడంతో నిజామాబాద్, హైదరాబాద్తో సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఆవేదన చెందుతున్నారు. ఇలా బోధన్ రైల్వేమార్గంపై రైల్వేశాఖ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నా.. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ మాత్రం ఇటువైపు తొంగిచూడడం లేదు. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని రెండు రైల్వే స్టేషన్లను మూసివేస్తే.. ఈ రైల్వేస్టేషన్లను ఎందుకు మూసివేశారంటూ ఆరా తీసిన పాపాన పోలేదు. ఎంపీ అర్వింద్ పట్టింపులేని తనమే బోధన్ రైల్వేమార్గం ప్రస్తుత దుస్థితికి కారణమని ప్రయాణికులు మండిపడుతున్నారు.
‘రాయలసీమ’ వచ్చేదెప్పుడో..
ప్రస్తుతం తిరుపతి – నిజామాబాద్ మధ్య నడుస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదన ఏండ్ల తరబడిగా కార్యరూపం దాల్చడం లేదు. ఈ పొడిగింపుతో రైల్వేశాఖకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాలు సరిపోవడం లేదు. దీన్ని బోధన్ వరకు పొడిగించినట్లయితే ఆ ఇబ్బంది తప్పుతుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ను బోధన్ వరుకు పొడిగించాలన్న యోచన రైల్వే అధికారులకు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.
బోధన్ -బీదర్ రైల్వేలైన్పై నిర్లక్ష్యం
సుమారు 80 సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైన బోధన్ – బీదర్ రైల్వేలైన్ నిర్మాణం నేటికీ ప్రారంభం కాలేదు. 2010 రైల్వే బడ్జెట్లో ఈ రైల్వేలైన్ నిర్మాణం మంజూరైంది. 2014 నాటికి సర్వే పూర్తయింది. అయితే, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ రైల్వేలైన్ నిర్మాణానికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు..
ఆందోళనకు సిద్ధమవుతున్న రైల్వే జేఏసీ
బోధన్ రైల్వే మార్గంలో మరిన్ని రైళ్లను నడపాలని, రాయలసీమ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ బోధన్లో విద్యార్థులు, యువజనులతో ఏర్పడిన జేఏసీ ఆందోళనకు సిద్ధమవుతున్నది. కొన్నేండ్లుగా బోధన్ రైల్వేమార్గం సమస్యలపై పోరాటం చేస్తున్న ఈ జేఏసీ.. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు సన్నాహాలు చేస్తున్నది. కాగా, మూసివేసిన ఎడపల్లి రైల్వేస్టేషన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఎడపల్లి మండల నాయకులు, ప్రయాణికులతో జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రెండు రైల్వేస్టేషన్ల మూసివేత
బోధన్ రైల్వే మార్గంలోని శక్కర్నగర్, ఎడపల్లి రైల్వేస్టేషన్లను రైల్వేశాఖ ఏడాది కిందట మూసివేసింది. నిజాం కాలం నుంచి ఉన్న ఈ రెండు రైల్వేస్టేషన్లను మూసివేయడంతో ప్రస్తు తం నడుస్తున్న రైలును సైతం ప్రయాణికులు ఉపయోగించుకోలేకపోతున్నారు. ప్రయాణికులు లేరన్న కారణంగా రైల్వే స్టేషన్లను మూసివేస్తున్నట్లు చెబుతున్న రైల్వే అధికారులు.. ఈ మార్గంలో గూడ్స్ రవాణా ద్వారా కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు. బోధన్లో కేంద్ర గిడ్డంగుల సంస్థ (సీడబ్ల్యూసీ)కు తెలంగాణాలోనే అతి రెండో పెద్ద గోదాములు ఉన్నాయి. ఈ మార్గంలో బియ్యం ఎగుమతి ఎక్కువగా జరుగుతుంటుంది. రైల్వేశాఖకు బియ్యం తదితర సరుకుల రవాణా ద్వారా ఏటా 30కోట్ల నుంచి రూ.35 కోట్ల ఆదా యం వస్తున్నది. అయినా.. ఇక్కడి ప్రయాణికుల ప్రయోజనాలను గాలికొదిలేశారు. ఇంత పెద్ద ఎత్తున లాభాలు వస్తు న్నా.. సామాజిక బాధ్యతగా ఇక్కడి ప్రయాణికులకు సౌకార్యాలు కల్పించాలన్న సోయి రైల్వేశాఖకు లోపించింది. బోధన్లోని గాంధీ పార్కుస్టేషన్ అధ్వానంగా మారింది. ప్రయాణికులు, రైళ్లు తిరగకపోవడంతో ఈ స్టేషన్ పోకిరీలకు అడ్డాగా మారింది.
ఒకే ఒక్క రైలు..
అతి తక్కువ చార్జీలతో నిజామాబాద్, హైదరాబాద్తోపాటు నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే బోధన్ ప్రాంతంలోని ప్రయాణికులు రైల్వేశాఖ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. నిజాంకాలం నుంచే బోధన్కు ప్రయాణికుల రైళ్ల రాకపోకలు జరిగేవి. అలాంటిది ఇన్నేండ్ల అభివృద్ధి తర్వాత కూడా తగినన్ని రైళ్లు నడపకపోవడం ఈ ప్రాంతంపై రైల్వేశాఖకు ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. కరోనా కారణంగా రెండేండ్ల నాడు రద్దుచేసిన బోధన్ – మహబూబ్నగర్ ప్యాసింజర్ను గత నెలలో ప్రారంభించారు. ఇది కంటితుడుపేనని, వేళకాని వేళలో బోధన్కు వచ్చిపోయే రైలు.. ప్రయాణికుల అవసరాలను తీర్చడం లేదని బోధన్ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఈ రైలు బోధన్ నుంచి ప్రతిరోజూ తెల్లవారుజామున 5.30 గంటలకు బయల్దేరుతుంది. తిరిగి రాత్రి 10.20 గంటలకు బోధన్కు చేరుతుంది. ఈ రైలు ఎప్పుడూ సమయానికి రాదు.. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చిన సందర్భాలూ అనేకం. రెండేండ్ల కిందటి వరకు ఉదయం వేళ బోధన్ నుంచి మిర్జాపూర్ వరకు ప్యాసింజర్ రైలు నడిచేది. దీంతో బోధన్, నిజామాబాద్, కామారెడ్డికి ప్రయాణాలు సాగించే విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉండేది. పర్బణి-నిజామాబాద్ బ్రాడ్గేజ్ లైన్ మరమ్మతుల కారణంగా నిజామాబాద్- హైదరాబాద్ రైల్వేమార్గంపై ఒత్తిడిని తగ్గించే సాకుతో ఈ రైలును రైల్వే అధికారులు 2019 ఫిబ్రవరిలో రద్దుచేశారు. అప్పట్లో మూడు నెలలపాటే రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే, ప్రతి మూడు నెలల తర్వాత మరో మూడు నెలలపాటు ఈ రైలును రద్దుచేస్తూ వచ్చారు. కరోనా లాక్డౌన్ రావడంతో ఇక ఈ రైలు ఊసే లేకుండాపోయింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ రైలును నడపాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
శక్కర్నగర్ రైల్వేస్టేషన్ను పునరుద్ధరించాలి..
నిజాంకాలంలో శక్కర్నగర్ రైల్వేస్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ రైల్వేస్టేషన్ను మూసివేయడం దారుణం. నేను నిజామాబాద్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంటాను. కామారెడ్డిలో జాబ్చేసినా, నిజామాబాద్లో చేసినా శక్కర్నగర్ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లేవాడిని. ఇంటికి సమీపంలో ఉన్న ఈ స్టేషన్ను ఆకస్మాత్తుగా మూసివేయడంతో బస్కు వెళ్లాల్సివస్తున్నది. మూడు రెట్లు ఎక్కువ చార్జీ భరించడమే కాకుండా అసౌకర్యానికి గురవుతున్నా.
– మందుగుల విద్యాసాగర్, బోధన్
ఎడపల్లి రైల్వేస్టేషన్ను మూసివేడయం శోచనీయం
ఎడపల్లి రైల్వేస్టేషన్ను మూసివేయడం సరైంది కాదు. అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకొని, స్టేషన్ను ప్రారంభించాలి. పలు గ్రామాలకు అందుబాటులో ఉన్న ఈ రైల్వేస్టేషన్ను తిరిగి ప్రారంభించాలి. ఈ స్టేషన్ మూసివేయడంతో ఇబ్బందిపడుతున్నాం. అధికారులు స్పందించి వెంటనే ఎడపల్లి రైల్వేస్టేషన్ను పునరుద్ధరించాలి.
– కంటెడి గంగాధర్, ఎడపల్లి