Dharmapuri Arvind | వినాయక్నగర్, ఏప్రిల్ 3: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని రోహింగ్యాలకు అడ్డాగా మార్చాలనుకుంటున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రంలో సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), ఎన్ఆర్సీ ( నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)ను అమలుచేయబోమని చెప్పడానికి ఉత్తమ్కుమార్రెడ్డి ఎవరని ప్రశ్నించారు. పార్లమెంట్ ఆమోదం పొందిన చట్టాలను అమలుచేయబోమని ఓ మంత్రి హోదాలో మాట్లాడడం దేశద్రోహ చర్య కిందికి వస్తుందని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం అర్వింద్ విలేకరులతో మాట్లాడారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి, ఓ వర్గం వారి ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడుతున్నదని విమర్శించారు.
సీఏఏ యాక్టు కాంగ్రెస్ వాళ్ల తాత నెహ్రూ తీసుకువచ్చారని గుర్తుచేశారు. దేశ సమగ్రత, శాంతి సామరస్యం కోసం పార్లమెంట్ చేసే చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఉత్తమ్కుమార్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి స్పందించాలన్నారు. ఓట్ల కోసం ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నల్గొండ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలను ఫీఎఫ్ఐకి అడ్డాగా మార్చారని అర్వింద్ ఆరోపించారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.