నాగిరెడ్డిపేట, మే 26: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల వద్ద జొన్నల లోడ్తో లారీలు నాలుగు రోజులుగా నిరీక్షిస్తున్నాయి. జిల్లాలోని మద్నూర్, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, పెద్దకొడప్గల్, గాంధారి మండలాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన జొన్నలను నాలుగు రోజుల క్రితం అధికారులు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములకు తరలించారు. కానీ గోదాముల వద్ద కూలీల కొరతతో.. నాలుగు రోజులుగా లారీలు అన్లోడ్ కావడం లేదు. గోదాముల వద్ద వందకుపైగా లారీలు లోడ్తో ఉన్నాయని, ఇప్పటి వరకు అధికారులు స్పందించడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లారీలు అన్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.