బీర్కూర్, ఆగస్టు 26 : రైతులను నిట్టనిలువునా ముంచేందుకే మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తోందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మీటర్లు పెట్టారని, అక్కడి రైతాంగం లబోదిబోమని మొత్తుకుంటున్నదని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ తన ప్రాణం పోయినా సరే మీటర్లు మాత్రం పెట్టేది లేదని, స్వయంగా అసెంబ్లీలోనే స్పష్టం చేశారన్నారు. బీర్కూర్ మండల కేంద్రానికి సమీపంలో బాన్సువాడ-జుక్కల్ నియోజకవర్గాలను కలుపుతూ రూ.48.50 కోట్లతో మంజీరా నదిపై నిర్మించిన వంతెన, రూ.10 లక్షలతో చేపట్టిన బోయి సంఘం, రూ.25 లక్షలతో నిర్మించిన అంబేద్కర్ భవనం, రూ.22 లక్షలతో గ్రామ పంచాయతీ భవన సముదాయం, రూ.7 లక్షలతో హమాలీ సంఘ భవనం, రూ.50 లక్షలతో నిర్మించిన ము న్నూరు కాపు సంఘ భవనాలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాక మునుపు అందరం సవతితల్లి ప్రేమలోనే బతికామని అన్నారు. అప్పటి వ్యవహారం సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది అన్న చందంగా ఉండేదని, అయినా భరించామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాతే ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతుల అప్పుల బాధను తొలగించడానికే సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారని వివరించారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటలు కరెంటును అందిస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అని అన్నారు.
ఉచిత పథకాలను వద్దంటున్న కేంద్రం
ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకొని, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని ఆలోచన చేస్తోందన్నారు. మోదీ ప్రభు త్వం ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీలను ప్రైవేటు పరం చేసిందని, ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నదని విమర్శించారు. అదానీలాంటి వారికి లాభం కలిగించడానికే మోదీ లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఉచిత పథకాలు వద్దంటోందని, ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి: ఎంపీ పాటిల్
ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. బీర్కూర్ మండల అభివృద్ధి కోసం కేంద్ర నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్ ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహిస్తూ మంత్రి, స్పీకర్, ఎంపీకి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, జడ్పీటీసీ తనబుద్ది స్వరూప, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, ఎంపీటీసీ సందీప్ పటేల్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మాజీద్, మండల కో-ఆప్షన్ మెంబర్ ఆరీఫ్, ఉపసర్పంచ్ షాహీన్ బేగం, డీసీసీబీ డైరెక్టర్ రాంపాటిల్, సొసైటీ చైర్మన్లు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులకు భయపడేదిలేదు : మంత్రి వేముల
బీజేపీ అక్రమ కేసులకు భయపడేది లేదని, వారి దుర్మార్గాలను కచ్చితంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షే మ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక పరిస్థితి చూస్తే అభివృద్ధి ఎలా ఉందో తెలుస్తోందన్నారు. బీజేపీ నాయకులు అభివృద్ధిని మరిచి కోడి గుడ్డుమీద వెంట్రుకలు పీకుతున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారికి పనీపాటా లేదన్నారు. సభాపతి పోచారం బాన్సువాడ అభివృద్ధి సృష్టికర్త అని కొనియాడారు. తనకు గురువులా, తండ్రిలా ఆయన ఎన్నో విషయాలు నేర్పిస్తారన్నారు. తన తండ్రి వేముల సురేందర్రెడ్డితో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేసుకున్నారు. సభాపతి బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారన్నారు. ప్రధాని మోదీ మాటలు తప్ప దేశానికి ఆయన చేసిందేమీలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. లోపాలను ఎత్తిచూపితే కేసులు పెడుతామని హెచ్చరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ను అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ కవితపై ప్రణాళిక ప్రకారం ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.