ఇందల్వాయి/ నిజామాబాద్ రూరల్, మార్చి 9: ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్పరం చేస్తూ, దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మోదీ సర్కారుకే దక్కుతుందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. బీజేపీ నాయకులు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్, కేసీఆర్, కవితలపై అరవడం తప్ప.. వారు రాష్ర్టానికి రూపాయి తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. గురువారం ఆయన ఇందూరు నగర శివారులోని 3వ డివిజన్ పరిధిలో ఉన్న గూపన్పల్లి, ఇందల్వాయి మండలంలోని లోలం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో బాజిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశానికి వందల కోట్ల అప్పులు చేసి అదానీ, అంబానీలకు దేశ సంపదను కట్టబెడుతున్నదని విమర్శించారు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని మోదీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. మోదీ తన తొమ్మిదేండ్ల పాలనలో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ బడాబాబులకే కట్టబెట్టిన కారణంగా లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీ.. ఇప్పటికీ నీటిమూటగానే మిగిలిపోయిందన్నారు.
అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను అకారణంగా కూల్చడం.. బీజేపీ నీచ సంస్కృతి పాలనకు అద్దం పడుతుందని మండిపడ్డారు. బీజేపీ నాయకులు మోసపూరితమైన వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్ లోలం గ్రామానికి ఏమైనా నిధులు తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ఏడాదికి రూ.5 కోట్లు ఎంపీ ఫండ్ వస్తుంటే నాలుగేండ్ల నుంచి ఏ ఒక్క గ్రామానికైనా రూపాయి ఇచ్చిన మొఖం లేదన్నారు. తాను ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిలాగే పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ను లోలం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.