కామారెడ్డి, నవంబర్ 5: సీఎం కేసీఆర్ను ఎంత మెజార్టీతో గెలిపిస్తే కామారెడ్డిలో అంత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ రమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్శి కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమణ మాట్లాడుతూ సమాజంలో పద్మశాలీలకు గొప్ప గౌరవం ఉన్నదని, పద్మశాలీలు ఆరాధించే వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. కులవృత్తులు, చేతివృత్తులపై ఆధారపడేవారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో బతుకమ్మ చీరలను నేసేలా ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. పద్మశాలీలకు రాజకీయంగా అనేక పదవులు ఇచ్చారని, అన్నిరంగాల్లో పద్మశాలీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారని తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం తనను పిలిచారని, నియోజకవర్గ అభివృద్ధిలో తనవంతు పాత్ర ఉంటుందని పేర్కొన్నారు.
తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, మలిదశ ఉద్యమంలో పద్మశాలీలు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. పద్మశాలీలకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని అన్నారు. త్వరలో పద్మశాలీల భవనం, కల్యాణ మండపానికి కృషి చేస్తానని తెలిపారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద నాలుగేండ్ల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని పెట్టి అధికారికంగా ఆయన జయంతి నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ మాటలకు మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ పవర్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, రాష్ట్ర నాయకుడు లక్ష్మీనారాయణ, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింహులు, కార్యదర్శి ఐరేని నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు చాట్ల రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ నాగభూషణం, నాయకులు సబ్బని కృష్ణహరి, క్యాతం సిద్దిరాములు, అర్చన తదితరులు పాల్గొన్నారు.