కంఠేశ్వర్, ఫిబ్రవరి 22 : బాండ్ పేపర్ బీజేపీని ఎవరూ నమ్మరని, బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టం కనిపిస్తున్నదని ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అర్వింద్ నాయకత్వ లోపంతోనే నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా చేర్చలేదని ఆరోపించారు. హామీలన్ని కేవలం బాండ్ పేపర్లకే పరిమితమని ఎద్దేవా చేశారు.
అర్వింద్కు చిత్తశుద్ధి ఉంటే, రైతులకు న్యాయం చేయాలనుకుంటే ఇప్పటికే పసుపు బోర్డు రావాల్సిందని, ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల స్టంట్ను ప్రజలు అర్థం చేసుకున్నారని, కులమతాల పేరిట రెచ్చగొట్టే బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు. ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చే నాయకులు అవసరం లేదని, పనులు చేసే నాయకులు కావాలని అన్నారు. కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లేకుంటే అర్వింద్కు రాజకీయ పుట్టుకనే లేదని ఎద్దేవా చేశారు.