ఖలీల్వాడి, జూన్ 13: షియా ముస్లింలకు అత్యంత పవిత్ర పర్వదినమైన మొహర్రం పండగకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో ఆమె శుక్రవారం ఫోన్లో మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం 2023లో మొహర్రం పండుగ నిర్వహణకు నిధులు విడుదల చేసిందని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదని తెలిపారు. మొహర్రం పండగకు ఏనుగుపై ఊరేగింపు తీయడం షియా ముస్లింల సంప్రదాయమని గుర్తు చేశారు.
2024లో ఏనుగుపై ఊరేగింపు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, ఇది షియా ముస్లింల మనసును గాయపర్చిందని వివరించారు. ప్రభుత్వం ఈసారి ఇలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఎంత వైభవంగా సంప్రదాయ బద్ధంగా మొహర్రం నిర్వహించిందో, ఈసారి కూడా అలాగే నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ స్పందిస్తూ నిధుల విడుదల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళుతానని, మొహర్రంను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇస్తానని హామీనిచ్చారు.