బోధన్ / ఎడపల్లి, అక్టోబర్ 26: ఎడపల్లి మండల కేంద్రం గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలతో పూలజాతరను తలపించింది. బతుకమ్మ సంబురాలకు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆమె పలు ఇండ్లలో బతుకమ్మలను పేర్చి, అక్కడే బతుకమ్మ ఆడారు. మంగళ్పాడ్ చౌరస్తాలో, బతుకమ్మ చెరువు వద్ద వేలాది మంది మహిళలతో ఆమె ఎంతో ఉత్సాహంగా ఆడిపాడారు.
బతుకమ్మ సంబురాల్లో బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా, జడ్పీ వైస్ చైర్మన్ రజితాయాదవ్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆయేషా ఫాతిమా బతుకమ్మ ఆడడం పలువురిని విశేషంగా ఆకట్టుకున్నది. సాయంత్రం దేశ్ముఖ్ గడి నుంచి ప్రారంభమైన బతుకమ్మల శోభాయాత్ర జనజాతరను తలపించింది. బతుకమ్మ సంస్కృతి, సంప్రదాయాన్ని కలకాలం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.