సిరికొండ/ఇందల్వాయి, ఫిబ్రవరి 28: సిరికొండ మండలంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ బుధవారం పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ రాజవ్వ చిన్నకుమారుడు అల్లిపురం శేఖర్, విద్యుత్షాక్తో బాబూరావు మరణించారు. వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. వారి వెంట ఎంపీపీ సంగీతారాజేందర్, జడ్పీటీసీ మాన్సింగ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీలు బెల్దారి గోపీ, అయిత సుజా ఫిలిప్ తదితరులు ఉన్నారు. విద్యుత్ షాక్కు గురై జిల్లా కేంద్రంలోని ప్రగతి దవాఖానలో చికిత్స పొందుతున్న ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన మొచ్చ సాయిలును ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. అంతకుముందు సిరికొండ వైస్ ఎంపీపీ, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తోట రాజన్న కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.