కంఠేశ్వర్, మే 20 : రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోతున్నామని ఎంత బాధపడ్డామో అందరికీ తెలుసన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ వారికి మొదటి నుంచి కడుపు మంటగా ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.
తెలంగాణ, పేదలు బాగు పడడం ఆ పార్టీకి ఎప్పుడూ ఇష్టం ఉండదన్నారు. ప్రజలు ఎప్పటికీ పేదరికంలో ఉంటేనే తమకు పదవులు వస్తాయని భావించే నాయకత్వం కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ బీడు భూములన్నింటికీ నీళ్లు వచ్చేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కుట్రలు పన్నుతూ అనేక కేసులు వేసిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకో వాలన్నారు.
అదే కుట్రలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి పగళ్లు రావడం ఆ వెనువెంటనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్డీఎస్ఏ అధికారులు పడవల్లో వచ్చి ఫొటోలు తీసి ప్రచారం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలందరినీ గందరగోళానికి గురి చేశారన్నారు. ఈ కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనంతరం కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు.
రాష్ర్టాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి తన జీవితాన్ని పణంగా పెట్టిన కేసీఆర్పై కాంగ్రెస్ చేస్తున్న కుట్రల్లో భాగంగానే ఆయనకు నోటీసులు అందజేశారన్నారు. తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఆమరణ నిరాహార దీక్ష చేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిష్టను, పేరును దెబ్బ తీయాలనే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కమిషన్లు ఏర్పాటు చేసిందని, ‘కాళేశ్వరం’ తెలంగాణ ప్రజల కోసం నిర్మించిన ప్రాజెక్టు అన్న విషయం గుర్తించాలన్నారు. రాజకీయ కుట్రతో, కక్షతో వేసిన ఇలాంటి కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్నే గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే నిజాలన్నీ బయటికి వస్తాయని, పాలు ఏవో నీళ్లు ఏవో ప్రజలకు స్పష్టత వస్తుందన్నారు.