నిజామాబాద్, జనవరి 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తన మాటలతో రైతులు, ప్రజలను మభ్యపెట్టిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై విరుచుకుపడ్డారు. గాలిమాటలు మాట్లాడడం మానేసి పసుపునకు మద్దతు ధర సాధించాలని ఎంపీ అరవింద్కు సూచించారు. స్పైసెస్ బోర్డును బెంజ్ కారులాంటిదని, పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిదని గతంలో అర్వింద్ అన్నారని, పసుపును అవహేళన చేసిన అర్వింద్కు ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఎంపీ అర్వింద్కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటని, తాము పసుపు బోర్డు డిమాండ్ చేసిన నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో కూడా లేరని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రి చాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని అర్వింద్ బాండ్ పేపర్పై రాసిచ్చారు. ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బాగుంటుందని ఆయన అన్నారు.
స్పైసెస్ బోర్డు బెంజ్ కారులాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కారులాంటిదని
అన్నారు. ఒకవేళ బెంజ్ కారు ఉంటే అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్లు ? ఎందుకు ఇంత వైరాధ్యంతో మాటలు చెబుతున్నారు ? ఎంపీ గాలి మాటలు మాట్లాడడం మానేయాలని మండిపడ్డారు. తాము కేంద్రంపై పదేపదే ఒత్తిడి చేయడంతోనే గతంలో స్పైసెస్ బోర్డు కార్యాలయం ఏర్పాటైందని, అది కూడా ఆయన గొప్పతనమని అర్వింద్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఎవరు ఏం చేయకున్నా ప్రతి మూడో సంవత్సరం పసుపు ధర పెరుగుతుందని, కానీ అది తన ఘనత అని ఎంపీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా స్పైసెస్ పార్కు ఏర్పాటుకు వేల్పూర్ వద్ద గతంలో కేసీఆర్ 42 ఎకరాలు కేటాయించారని, ఆ పార్కులో పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
జక్రాన్పల్లిలో విమానాశ్రయానికి కేసీఆర్ ప్రభుత్వం 800 ఎకరాలు సేకరించిందని, అక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని ఎంపీ అర్వింద్ను డిమాండ్ చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ 2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. పలువురు ముఖ్యమంత్రులను కలిసి పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతుగా లేఖలు సేకరించాను. పీఎం మోడీని రెండుసార్లు కలిసి బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశానని, పార్లమెంట్లో అనేకసార్లు మాట్లాడడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా ప్రవేశపెట్టానని వివరించారు. ఇలా తాను గతంలో త్రిముఖ వ్యూహంతో అలుపెరగని పోరాటం చేశానని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు.
రూ.15వేలు మద్దతు ధర ఏది?
క్వింటాలు పసుపునకు రూ.15 వేల కనీస మద్దతు ధర ప్రకటించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని సూచించారు. ఈ రెండు చేసినప్పుడే పసుపు బోర్డుకు సార్థకత ఏర్పడుతుందని, అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణన్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. తూతూ మంత్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయడం కాదని, అందుకు తగిన సౌకర్యాలు పరిశోధన సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలని సూచించారు. పసుపు బోర్డునే ఏర్పాటు చేయాలని తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. తాము పసుపు బోర్డుపై డిమాండ్ చేసినప్పుడు బీజేపీ ఎంపీ అర్వింద్ రాజకీయాల్లో కూడా లేదని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయని, పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ కార్యక్రమంలా చేశారని ఆక్షేపించారు.
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని, ప్రొటోకాల్ను పాటించలేదని, ఇది ప్రభుత్వ నియమనిబంధనలకు విరుద్ధమన్నారు. కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారని.. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రెస్మీట్ అనంతరం ఎమ్మెల్సీ కవితకు పసుపు కొమ్ములతో తయారు చేసిన దండతో పలువురు బీఆర్ఎస్ నేతలు ఘనంగా సత్కరించారు. సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మేయర్ నీతూకిరణ్, బీఆర్ఎస్ నేతలు సుజిత్ సింగ్ ఠాకూర్, బాజిరెడ్డి జగన్, సిర్ప రాజు, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.