పది మందికి సాయం చేశామంటే ఆ రోజు రాజకీయ నాయకులకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. గులాబీ సైనికులు చిందించిన స్వేదం నేడు చెరువుల్లో కనిపిస్తున్న మంచినీటి చుక్కలు. బీఆర్ఎస్ కార్యకర్తల త్యాగమే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపం. బీఆర్ఎస్ ఉట్టి రాజకీయ పార్టీ కాదు. ఎంతో కష్టంతో, కోపతం, ఆవేదనతో, ప్రేమతో పుట్టుకొచ్చిన పార్టీ. ప్రజలు బాగు చేయాలని భావించే పార్టీ మనది. మరింత బాధ్యతగా పనిచేద్దాం.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేనన్ని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని, జరిగిన అభివృద్ధిని.. అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నమస్తే తెలంగాణ పత్రిక, టీన్యూస్ చానళ్లను ఆదరించాలని కార్యకర్తలకు సూచించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన విజయం తథ్యమన్నారు. ఎవరైనా పోటీకి వస్తే మైసమ్మ ముంగిట మేకపోతును బలిచ్చినట్లేనని గుర్తుంచుకోవాలన్నారు.
-మాక్లూర్, మే 30
మాక్లూర్, మే 30: తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కార్యకర్తల కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేనన్ని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని, జరిగిన అభివృద్ధిని.. అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అడవిమామిడిపల్లిలో మంగళవారం నిర్వ హించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొ ని ప్రసంగించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. గతం లో కన్నా అధిక మెజారిటీతో వచ్చే ఎన్నికల్లో జీవన్రెడ్డి గెలుస్తారన్న విశ్వాసం ఉందన్నారు. జీవన్రెడ్డి మీద పోటీ చేయాలనుకుంటే మైసమ్మ ముంగిట మేకపోతును బలి ఇచ్చినట్లే అవుతుందన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు, మన పార్టీ స్థాపించిన నమస్తే తెలంగాణ పత్రికతోపాటు టీ న్యూస్ ఛానల్ను ఆదరించాలని సూచించారు.
ప్రతిఒక్కరూ పత్రికను చదివేలా, టీ న్యూస్ ఛానల్ను చూసేలా చేయాలని, అందులో వచ్చే తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కథనాలను ప్రజలకు వివరించాలన్నారు. మండల, గ్రామస్థాయిలో అధ్యక్షులు చొరవ తీసుకుని టీ న్యూస్ను సబ్స్ర్కైబ్ చేయించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఇదేమి పార్టీ అని అవహేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలు అందించే స్థాయికి ఎదిగిందన్నారు. పదేండ్లలో దేశంలో ఎవ్వరూ చేయనన్ని మంచి పనులు బీఆర్ఎస్ పార్టీ చేసి చూపెట్టిందని స్పష్టంచేశారు. మరింత బాధ్యతగా పని చేద్దామని పిలుపునిచ్చారు. రెండు దశాబ్దాల నుంచి ప్రజల్లో ఉన్న నాయకులు ఈ మండలంలో ఉన్నారని, అనేక మంది కార్యకర్తలు, నాయకులు గులాబీ కండువాకు అంకితమయ్యారని కొనియాడారు. సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని, తెలంగాణ ప్రజల ఆశయాలను, అమరవీరుల త్యాగాలను, జయశంకర్ సార్ స్ఫూ ర్తిని తీసుకొని బీఆర్ఎస్ ముందుకెళ్తున్నదని, ఇలాంటి పార్టీలో ప్రతిఒక్కరికీ అవకాశాలు వస్తాయని స్పష్టంచేశారు. జిల్లాలో లక్షా 33 వేల మంది బీడీ కార్మికులకు పింఛన్ అందుతున్నదని, ప్రత్యేకించి బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ దవాఖానను నిర్మించాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ దవాఖానను నిర్మిస్తే కామారెడ్డి ప్రాంతంలోని కార్మికులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికులు నిజామాబాద్లో పెద్దసంఖ్యలో ఉంటారని, వారికి బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు.
-రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
మాక్లూర్, మే 30: దేశంలో ఇంత అభివృద్ధి, ఆనందం ఎక్కడా కనిపించడం లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ఎంపీగా మళ్లీ కవితను గెలిపించుకుందామని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అర్వింద్, రేవంత్రెడ్డిలు ప్రజలను మోసం చేస్తున్నారని, వారు ఓట్లు అడిగేందుకు వస్తే మహిళలు చీపుర్లతో కొట్టాలని… మళ్లీ మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఉన్న మూడు, నాలుగు సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో 3వేల చెరువులు నీళ్లులేక ఎండిపోయి, కబ్జాలకు గురయ్యాయని అన్నారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ రాష్ట్రం చేసుకున్న పుణ్యమని, కార్పొరేటు వైద్యం, విద్య దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోఅందుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రధాని మోదీ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని, కర్ణాటక ప్రజలు సరైన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. ఆర్మూర్ నుంచి మూడోసారి ఆశన్నగారి జీవన్రెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో మల్టీ నేషనల్ కంపెనీలు స్థాపించేలా కృషి చేస్తూ వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నారని అన్నారు. జిల్లాలో కార్మిక భవనానికి కోటి రూపాయలు మంజూరు చేయడంతోపాటు జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ దవాఖానకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు.
గులాబీ పండుగ..శ్రేణుల్లో ఉత్సాహం..
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా అడవిమామిడిపల్లి ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్ హయాంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో గులాబీమయమైంది. జై కేసీఆర్.. దేశ్ కీ నేత కేసీఆర్.. జై కవితక్క, జై జీవనన్న.. జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన కార్యకర్తలు, నాయకుల దంపతులకు ఎమ్మెల్యే జీవన్రెడ్డి-రజితారెడ్డి దంపతులు నూతన దుస్తులు పెట్టి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం భోజనాలు వడ్డించి, కార్యకర్తల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, సీనియర్ నాయకులు రాజారాంయాదవ్, కోటపాటి నర్సింహ నాయుడు, డాక్టర్ మధుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను వివరించాలి…
ఎన్నికలు రాబోతున్న వేళ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతోపాటు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అమరవీరుల త్యాగాలకు చిహ్నంగా స్తూపం నిర్మించడం సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనమని వివరించారు. సీఎం కేసీఆర్కు సన్నిహితంగా ఉంటూ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే జీవన్రెడ్డిని కొనియాడారు. ఎమ్మెల్సీ కవితతో సహచర ఎంపీగా ఏడాది కాలం పనిచేశానని, ఎంపీలు జయాబచ్చన్, ఎన్సీపీ నాయకురాలు కవితక్కను స్ఫూర్తిగా తీసుకునేవారని గుర్తుచేశారు.
కార్యకర్తలే పునాది..
కార్యకర్తలే పార్టీకి పునాదిరాళ్లని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. తండ్రికి తగ్గ తనయ కవిత, తనయుడు కేటీఆర్ అని వారి సారథ్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతున్నదన్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలోని గొల్లకురుమలు ఆర్థికంగా ఎదిగేలా సీఎం కేసీఆర్ చేశారని బీఆర్ఎస్ నేత రాజారాంయాదవ్ అన్నారు. 75 ఏండ్ల చరిత్రలో గ్రామ స్వరాజ్యం, రైతు రాజ్యం తెలంగాణలో ఇప్పడు కనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యేగా మూడోసారి జీవన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేశారని బీఆర్ఎస్ నేత డాక్టర్ మధుశేఖర్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలు తెలంగాణలో అమలవుతున్నాయని పేర్కొన్నారు.