ఖలీల్వాడి, నవంబర్ 23 : ఓటు వేయకపోతే ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ఉండదని, వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఓటు వేయకపోతే పనికిరాని వాళ్లు రాజకీయాల్లోకి వస్తారని అన్నారు.ఆరోపణలు చేసే ముందు రాజకీయ నాయకులు ఆలోచించాలని సూచించారు. ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే.. దేశమంత శక్తిమంతంగా ఉంటుందన్నారు. నిజామాబాద్లో కొత్తగా ఓటు హక్కు పొందిన కళాశాల విద్యార్థినులతో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పెద్దసంఖ్యలో హాజరైన విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలంటే బ్రహ్మపదార్థమనో, సంబంధం లేదనో ఎవరు గెలిస్తే ఏమిటన్న అభిప్రాయంలో ఉండవద్దని సూచించారు. తిండి, గూడు, బట్ట ఎంత ముఖ్యమో స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యమని, స్వేచ్ఛను కాపాడుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని, సానుకూల దృక్పథంతో వాటిని వాడాలని సూచించారు.
ప్రతిరోజూ వార్తాపత్రికలను చదవాలని, సమాజంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. మంచి భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్య ప్రక్రియలో క్రియాశీకలంగా భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. ఓటు వేయకపోతే రాజకీయాల్లోకి పనికిరాని వారు, జ్ఞానం లేని వారు వస్తారని, తద్వారా వారు తీసుకునే నిర్ణయాలకు ప్రజలంతా ఇబ్బంది పడుతారని చెప్పారు. అందులోనూ సరైన వారిని ఎన్నుకోవాలని సూచించారు. భారత సైన్యం ప్రతికూల వాతావరణ పరిస్థితిని తట్టుకుని కూడా దేశానికి రక్షణ కల్పిస్తుంటే కనీసం మనం లైన్లో నిలబడి ఓటు వేయలేమా అని ప్రశ్నించారు. ఓటు హక్కును వినియోగించుకోకపోతే వ్యవస్థలు నిర్వీర్యమవుతాయన్నారు. హరితహారం కింద మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినప్పుడు అందరూ విమర్శించారని, కానీ ఇప్పుడు దేశంలోనూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 7 శాతానికి పైగా అటవీ విస్తరణ పెరిగిందని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళలు, యువతకు ఏం సందేశమిస్తారని ఓ యువతి అడిగిన ప్రశ్నకు కవిత సమాధానమిస్తూ ..రాజకీయాలు అంత సులువు కాదని, కానీ రాజకీయ నాయకులుగా తీసుకునే ఓ నిర్ణయం కోట్ల మంది జీవితాలను మార్చుతుందన్నారు. కష్టపడి ప్రజల కోసం పని చేయాలన్నారు. అన్ని చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. అన్ని ఆలోచించుకొని రాజకీయాల్లోకి రావాలన్నారు. వచ్చిన తర్వాత మాత్రం ప్రజల కోసం పని చేయాలన్నారు. కుటుంబ సభ్యుల మద్దతు లేకపోతే మహిళలు రాజకీయాల్లోకి రావద్దని ఆమె సూచించారు.
ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని, స్వయం ఉపాధికి సహకారం, జిల్లాల్లో ఐటీ హబ్ల ఏర్పాటుపై యువతులు అడిగిన ప్రశ్నలకు కవిత స్పందిస్తూ .. దేశంలో ఎక్కడా లేని విధంగా 2.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. స్వయం ఉపాధి కోసం కూడా స్టార్టప్ వంటి వాటిని ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. టీహబ్, టీ వర్క్స్ వంటి వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూతనిస్తున్నదని స్పష్టం చేశారు.
తొలిసారి ఓటు వేసినప్పటికీ అనుభవం చెప్పాలని ఒక విద్యార్థిని కోరగా.. మొదటి నుంచి తన తండ్రికే ఓటు వేశానని, చింతమడకలో తొలిసారి తన తల్లిదండ్రులతో కలిసి ఓటు వేశానని, అది ఎప్పటికీ మరిచిపోలేని అనుభవమని అని కవిత చెప్పారు.
బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలని ఒక విద్యార్థిని ప్రశ్నించగా.. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిందని కవిత సమాధానమిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిరోజూ రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పని చేస్తోందన్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరించి మార్పులు చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నామన్నారు. సానుకూల దృక్పథంతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నదని, కాబట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని కవిత సూచించారు.