బోధన్, నవంబర్ 27: కాంగ్రెస్ పార్టీది ఓట్లు దండుకునే విధానమని, ఇందుకోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తూ.. ప్రజల్ని, రైతుల్ని గందరగోళానికి గురిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బోధన్ పట్టణ శివారులోని ఎన్ఎన్ కన్వెన్షన్ హాలులో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్కు మద్దతుగా సోమవారం నిర్వహించిన కమ్మ ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కౌలు రైతులు, రైతుకూలీలకు రైతుబంధు ఇస్తామని రేవంత్రెడ్డి చెబుతున్నారని, ఇదెలా సాధ్యమో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పాలని డిమాండ్చేశారు. ఓట్ల కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. వ్యవసాయరంగంలో అభివృద్ధి సాధించిన కమ్మకులస్తుల పిల్లలు అమెరికాలోనో, హైదరాబాద్లోనో ఉంటున్నారని, ఎక్కువమంది తమ భూముల్ని కౌలుకు ఇస్తుంటారని చెప్పారు. దీంతో రేవంత్రెడ్డి విధానంతో ఇబ్బందులు ఏర్పడుతాయన్న విషయాన్ని కమ్మ కులస్తులు గ్రహించాలన్నారు. దాదాపు పూర్తికావచ్చిన రుణమాఫీ ప్రక్రియను కాంగ్రెస్ ఆపివేయించిందని, ఎన్నికలు పూర్తయన వెంటనే రైతుబంధు పంపిణీతోపాటు మిగిలిన రుణమాఫీని పూర్తిచేస్తామని కవిత హామీఇచ్చారు.
తెలంగాణ రాకముందు లక్షలుగా ఉన్న భూమలు ధరలు కోట్లకు పెరిగాయని, ఇందుకు వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో అమలుచేసిన రైతాంగ విధానాలే కారణమని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. పొరపాటున కాంగ్రెస్ పాలన వస్తే.. రైతుల భూమలు ధరలు పడిపోతాయని, రైతులకు భరోసాను కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. తనను మరోసారి గెలిపించాలని కమ్మ కులస్తులను షకీల్ కోరారు.
బీఆర్ఎస్ నాయకుడు, పీఆర్టీయూ మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.రవికిరణ్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గోగినేని నరేంద్రబాబు, సంజీవ్కుమార్, సత్యవతి, కమ్మ కులానిని చెందిన డీసీసీబీ డైరెక్టర్ గింజుపల్లి శరత్, బోధన్ కౌన్సిలర్ కామేపల్లి నాగవర్ధిని సత్యం, సర్పంచులు గోగినేని జ్యోతి నరేంద్రబాబు, బొల్లేపల్లి సుశీల, మద్దినేని శ్రీనివాస్, పల్లెంపాటి కృష్ణప్రసాద్, శ్రీదేవి, రాములు, బోధన్ కౌన్సిలర్ కామేపల్లి నాగవర్ధిని సత్యం, సొసైటీ చైర్మన్లు దాసరి అంతయ్య, మెట్ల రవీంద్రబాబు, ఎంపీటీసీ వెంకట్రావ్, కమ్మ కులం ప్రతినిధులు మల్లవరపు బాలస్వామి, పావులూరి శ్రీనివాస్రావు, ఉమమహేశ్వరరావు, కంటె సత్యనారాయణ పాల్గొన్నారు.