మీదికెంచి కురుస్తున్న వానలు.. కిందికెంచి వస్తున్న మొలకలు.. రైతు కంటా ఆగని కన్నీళ్లు.. అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులతో కుంగిపోతున్న రైతులకు జిల్లా ప్రజాప్రతినిధులు బాసటగా నిలుస్తున్నారు. అధైర్యపడొద్దని, అండగా మేమున్నామని భరోసా ఇస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సోమ, మంగళవారాల్లో పూర్తిగా ధాన్యం కొనుగోళ్లపైనే దృష్టి సారించారు. సోమవారం సాయంత్రం నుంచి ఊరూరు తిరిగిన ఆయన.. రాత్రికి రాత్రే కాంటాలు పెట్టించి రైతుల కన్నీళ్లు తుడిచారు. అర్ధరాత్రి దాటినా తాను నిద్ర పోలేదు.. అధికారులనూ నిద్ర పోనివ్వలేదు. కాంటాలు ప్రారంభించే వరకే కాదు.. ధాన్యం బస్తాలను తరలించే వరకూ అక్కడి నుంచి కదల్లేదు. 70 ఏండ్ల వయస్సులో తాను పరుగెడుతూ, జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఇక, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్ కూడా అన్నదాతలను పరామర్శించారు. దెబ్బతిన్న పొలాలను పరిశీలించి, బాధిత రైతులను ఓదార్చారు. ఆందోళన వద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నిజాంసాగర్, మే 2: అకాల వర్షాలతో పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. తడిసిపోయిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మండలంలోని కొమలంచ గ్రామశివారులో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి పోయిన ధాన్యాన్ని పరిశీలించారు. పంట దెబ్బతిన్న రైతుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని, ఇటీవల తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటన కూడా ఇచ్చారని అన్నారు. రైతులు సంతోషంగా ఉండాలన్నదే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. ఆయన వెంట సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, తహసీల్దార్ నారాయణ, ఏవో అమర్ప్రసాద్, సర్పంచులు లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, రాంచందర్, ఎంపీటీసీ సభ్యులు అంకిత శ్రీనివాస్, ఎస్సై రాజు నాయకులు ఉన్నారు.
ఎమ్మెల్యే హన్మంత్షిండే మంగళవారం కొమలంచ గ్రామ శివారులో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వాగులు వంకలు దాటుకుంటూ శివారు ప్రాంతంలో పర్యటించారు. రైతులకు నేనున్నాను అంటూ భరోసా కల్పించారు. వారం రోజులుగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పర్యటిస్తూ దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతోపాటు వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలిస్తున్నారు.