మోర్తాడ్, జూన్ 5: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీని ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటివరకు బంగారం ఇవ్వలేదని, మరింకెప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. వేల్పూర్ మండలానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద కొత్తగా మంజూరు కోసం సిద్ధంగా ఉన్న 17 బ్యాచ్ ఫైల్స్పై ఎమ్మెల్యే శుక్రవారం తన నివాసంలో సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబ్డిడల పెండ్లిళ్లు చేసిన వారు తులం బంగారం వస్తుందన్న ఆశతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు మంజూరైన వారికి, ఇకముందు మంజూరయ్యే వారికి కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఫైల్స్ను పెండింగ్లో ఉంచకుండా వెంటనే సంతకాలు పూర్తిచేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులకు సూచించారు.
నేడు బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం.. హాజరు కానున్న వేముల, పార్టీ ముఖ్య నేతలు
మోర్తాడ్, జూన్ 5: బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని శనివారం ఉదయం 10 గంటలకు మోర్తాడ్ శివారులోని లలిత గార్డెన్లో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ డిజిటల్ సభ్వత్వ నమోదు, ‘సర్’ అంశంపై చర్చించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, బాల్కొండ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి, జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హనుమంత్ షిండే, జీవన్రెడ్డి, గణేశ్గుప్తా, నల్లమడుగు సురేందర్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు ముజీబుద్దీన్ హాజరవుతారని తెలిపారు.