వేల్పూర్/ముప్కాల్, మే 1: ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని కోరుతూ బుధవారం వేల్పూర్ మండలం మోతె, అక్లూర్, ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి, రెంజర్ల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి గ్రామానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఒకవైపు తీవ్రమైన విద్యుత్ కోతలు, మరోవైపు తాగునీటి ఎద్దడితో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మున్ముందు మరిన్ని సమస్యలు తప్పవని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంతో ఉన్నప్పటికీ మొన్నటి వరకు ఆపార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చేసిందేమీ లేదని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
పసుపు బోర్డు ఏర్పాటైందని ఎంపీ అర్వింద్ చెబుతున్నాడని, అది ఎక్కడుందో చూపాలని వేముల ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అర్వింద్కు ఈ ఎన్నికల్లో రైతులు బుద్ధి చెబుతారన్నారు. ఎంపీగా అర్వింద్ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలోనూ ఇప్పటివరకు పర్యటించలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ప్రజల పక్షాన పోరాడే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.