రెంజల్, ఫిబ్రవరి 22: మోదీ ప్రభుత్వం మాటలే తప్ప హామీలను అమలుచేయకుండా.. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో వారం రోజుల్లో మరో రెండు పథకాలను అమలుచేస్తామని చెప్పారు. మండలంలోని కళ్యాపూర్, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో అధికారులతో కలిసి గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కూనేపల్లిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వారం రోజుల్లో రూ.500లకే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డుదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలుచేసి ప్రజల రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు.
వచ్చే నెలలో జరిగే పదో తరగతి పరీక్షల్లో 75 శాతం కన్నా తక్కువ ఫలితాలు సాధిస్తే అందుకు పూర్తి బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి రూ. కోటిన్నరతో మౌలిక వసతులను కల్పిస్తామన్నారు.విద్యార్థుల తల్లి దండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు స్వస్తిపలికి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. కళ్యాపూర్ గ్రామంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులకే అందజేయాలని అధికారులను ఆదేశించారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, మండలాధ్యక్షుడు మోబిన్ఖాన్ తదితరులు ఉన్నారు.