వర్ని, జనవరి 22: మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న బడాపహాడ్ షాదుల్లా బాబా హుస్సేని ఉర్సు సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి తలపై సందాల్(గంధం) పెట్టుకొని వేడుకలను ప్రారంభించారు. ఉర్సును పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. జలాల్పూర్ గ్రామ కచేరి వద్ద కవ్వాలి కార్యక్రమంతో ఉర్సు ప్రారంభమైంది. తలపై సంధాల్ పెట్టుకొని ముందుకు సాగిన ర్యాలీలో ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా అలంకరించిన గుర్రం, ఒంటెలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, మండల కో ఆప్షన్ సభ్యుడు కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, సర్పంచ్ అనితా వెంకాగౌడ్, తహసీల్దార్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉర్సులో కాంగ్రెస్ నాయకులు ప్రదర్శించిన అత్యుత్సాహం భక్తులను నిరాశకు గురిచేసింది. ఎమ్మెల్యే పోచారం కవ్వాలిలో పాల్గొన్న సమయంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్రెడ్డి, అనుచరులు కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆందోళన చేశారు. ఎమ్మెల్యే ముందుకు సాగుతుండగా వెనుక ఉన్న కాంగ్రెస్ నాయకులు సందాల్ను తాము కూడా తలపై పెట్టుకొని ప్రారంభిస్తామని హంగామా సృష్టించారు. సందాల్ను వెనక్కి తీసుకురావడం శుభసూచకం కాదని నిర్వాహకులు చెప్పినా వినలేదు. తిరిగి ప్రారంభించాల్సిందేనంటూ మొండికేశారు. సంధాల్ను కొందరు బలవంతంగా వెనక్కి తెచ్చి తిరిగి వేడుకలను నిర్వహించారు. ఏండ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని సందాల్ ను వెనక్కి తేవడంపై నిర్వాహకులు, భక్తులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధి హోదా లేకపోయినా ఆధిపత్యం కోసమే హంగామా సృష్టించారని భక్తులు విమర్శించారు.