నందిపేట్, జనవరి 3: ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తీర్చేందుకు మొదటి ప్రాధాన్యమిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్, కస్తూర్బా పాఠశాలలను ఆయన బుధవారం పరిశీలించారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటగది, మూత్రశాలలను పరిశీలించారు. నియోజకవర్గంలోని 173 ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని, ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నందిపేట్లోని వసతిగృహ స్థలాన్ని పరిశీలించారు. కోట్లాది రూపాయల విలువచేసే స్థలాన్ని వాడుకలోకి తీసుకురావాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను కోరామని, స్థలాన్ని శుభ్రం చేస్తే క్రీడా ప్రాంగణంగా ఉపయోగించుకుంటామన్నారు.