కామారెడ్డి, మార్చి 9: సీఎం రేవంత్రెడ్డి కామారెడ్డిని షబ్బీర్ అలీకి రాసిచ్చాడా? ఏ ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పేరును శిలాఫలకంపై వేయిస్తారని, ఏ హోదాతో ప్రారంభోత్సవాలు చేయిస్తారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులను ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను శనివారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో రోగులకు అందుతున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఏ ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ షబ్బీర్ అలీని దవాఖాన ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు పేరు శిలాఫలకంపై ఏ జీవో ప్రకారం పెట్టారో కలెక్టర్ సమాధానం చెప్పాలని అన్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎందుకు ఆహ్వానం పలకలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చి కామారెడ్డిలో పోస్టింగ్ వేయించుకున్నారని, కానీ తాను ఉన్ననీ రోజులు కామారెడ్డిలో అవినీతిని జరగనివ్వనని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా దవాఖానలోని రెండో అంతస్తులోని సేవలను ఏ ప్రొటోకాల్ ప్రకారం షబ్బీర్ అలీ ప్రారంభించారని అధికారులను ప్రశ్నించారు. కామారెడ్డిలో అధికారులు ఎలాంటి అవినీతికి పాల్పడినా ఊరుకునేది లేదన్నా రు. ఇక నుంచి 57 నెలలు యుద్ధమే జరుగుతుందని అన్నారు. ధైర్యం, నిజాయితీ ఉన్నవారే ఇక్కడ పనిచేయాలని లేదంటే వాలంటరీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏది ప్రారంభించినా షబ్బీర్ అలీకి ప్రొటోకాల్ ఉండదని అన్నారు. తనను ఎదుర్కోలేక అనవసరంగా షబ్బీర్ అలీని ముందుకు తెస్తున్నారని, ఎవరు ఎన్నిచేసినా రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. కామారెడ్డి అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.