కామారెడ్డి, డిసెంబర్ 18 : కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. నియోజకవర్గంలో అవినీతిరహిత, పారదర్శక పాలన అందించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి మాట్లాడారు. కలెక్టరేట్ దేవాలయంలాంటిదని, అధికారులు దేవుళ్ల వంటివారని అన్నారు. ప్రజలు మన పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. విధి నిర్వహణలో కొన్ని ఒత్తిడులు వచ్చినా నిబంధనల మేరకు పని చేయాలన్నారు. పరిపాలన శక్తివంతంగా ఉండాలని,విధి నిర్వహణలో మానవతా దృక్పథం నిజాయితీ కలిగి ఉండాలని సూచించారు.
తనకు వ్యవస్థ పై గౌరవం ఉందని జనానికి ఉపయోగపడే సమస్యల గురించి మాత్రమే అధికారులను అడుగుతానని స్పష్టం చేశారు.
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లా అధికారులు మంచి సమర్థులని తమ శాఖల ద్వారా కేటాయించిన లక్ష్య సాధన కోసం బాగా కృషి చేస్తున్నారన్నారు. ఈ వానాకాలంలో 4 కోట్ల 43 లక్షల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. 5500 మంది వీధి వ్యాపారులకు మూడు దఫాలుగా రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసి దేశంలో అగ్రస్థానంలో నిలిచామన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుం డా చూస్తామన్నారు. కామారెడ్డి పట్టణంలో రెండు రైల్వే వంతెనలు, పది బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీవో శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, డివిజనల్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.