కామారెడ్డి/బీబీపేట్/మాచారెడ్డి/ దోమకొండ/ భిక్కనూరు/ రాజంపేట్, జనవరి 10 : కామారెడ్డి నియోజకవర్గంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కాలిపల్లి వెంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. జిల్లాకేంద్రంతోపాటు బీబీపేట్, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, రాజంపేట్ మండలాల్లో బుధవారం పర్యటించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి పథకం ఆడపిల్లలు ఉన్న పేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని అన్నారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తామని అన్నారు.