మండల కేంద్రమైన మాక్లూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిపై ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. సర్పంచ్ బోయినపల్లి అశోక్రావు వినతి మేరకు గ్రామాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.2కోట్ల 57లక్షలు మంజూరు చేశారు. దీంతో మండల కేంద్రంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో ఎక్కడ చూసినా అద్దంలా మెరుస్తున్నాయి. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు నిర్మించడంతో పరిశుభ్రతకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. మాక్లూర్ బస్టాండ్ నుంచి ప్రభుత్వ దవాఖాన వరకు రూ.40లక్షలతో డబుల్ తారురోడ్డును నిర్మించడంతో దవాఖానకు వచ్చే రోగులకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.
మండల కేంద్రానికి మంజూరైన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి రూ.కోటీ50లక్షలతో భవనాలు నిర్మించారు. 10వ తరగతి పూర్తికాగానే విద్యార్థులకు నేరుగా అడ్మిషన్లు కల్పించి ఉన్నత విద్యను అందిస్తున్నారు. గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలను తొలగించి దానిస్థానంలో రూ.4కోట్ల 50లక్షలు విద్యాశాఖ మంజూరు చేయడంతో కార్పొరేట్ తరహాలో ఉన్నత, ప్రాథమిక పాఠశాల భవనాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం రూ.17.50లక్షలతో నూతన గ్రంథాలయాన్ని నిర్మించారు.
మాక్లూర్ అభివృద్ధికి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. గ్రామస్తులు, పాలకవర్గం విన్నవించిన అభివృద్ధి పనులకు నిధు లు మంజూరు చేయించారు. ప్రతి వీధిలో వేసిన సీసీ రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. మండల కేంద్రంలో ఉన్న ఎల్లమ్మ, భీమన్న, పెద్దమ్మతల్లి, అడెల్లి పోచమ్మ ఆలయాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా సీసీ రోడ్డు వేయడంతో భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. మా గ్రామాన్ని ప్రగతి బాటలో నడిపించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు.
అభివృద్ధి పనులతో మండల కేంద్రమైన మాక్లూర్ సరికొత్తగా కనిపిస్తున్నది. తొమ్మిదేండ్లలో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో అన్నిరంగాల్లో వెనుకబడింది. గుంతల రోడ్లపై ప్రయాణంతో గ్రామస్తులు నిత్యం నరకం అనుభవించారు. కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అరిగోస పడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాక్లూర్ గ్రామ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతూ వచ్చాయి. స్వరాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆశన్నగారి జీవన్రెడ్డి కృషితో అభివృద్ధికి అడుగులు పడ్డాయి. ప్రభుత్వం ద్వారా కోట్లాది రూపాయలు మంజూరు చేయించడంతో మాక్లూర్ అన్నిరంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.
రాష్ట్ర ప్రభుత్వం పల్లెల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి నెలా ఆయా గ్రామ పంచాయతీలకు జానాభా ప్రాతిపదికన రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎన్ఎఫ్ఎసీ) ద్వారా నిధులను విడుదల చేస్తున్నది. మండల కేంద్రానికి యేటా రూ.58.06లక్షలు మంజూరవుతుండగా, తొమ్మిదేండ్లలో రూ.5కోట్ల92లక్షలు మంజూరు కాగా ఈ నిధులతో జీపీపాలక వర్గం పచ్చదనం-పరిశుభ్రత, ట్రాక్టర్ల ఈఎంఐ తదితర వాటికి వినియోగిస్తున్నది. దీంతో గ్రామం పచ్చదనం- పరిశుభ్రతకు చిరునామాగా నిలిచింది. 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నారు.
మాక్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 414 మంది ఆడబిడ్డల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4.04కోట్లు అందజేసి బాసటగా నిలిచింది. 1065 మంది పింఛన్దారులకు సంవత్సరానికి రూ.2.68కోట్ల చొప్పున తొమ్మిదేండ్లలో రూ.24.08కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కులవృత్తులపై ఆధారపడిన వారికి చేయూతనందించింది. గొల్ల, కురుమలకు గొర్రెలు యూనిట్లు ,మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ, రజక, నాయీబ్రాహ్మణులకు యంత్రాలు, ఉచిత విద్యుత్ తదితర పథకాలను అమలు చేసి సొంతూరిలో గౌరవంగా బతికేలా చేయూతనిచ్చారు. మాక్లూర్లో 50 మంది లబ్ధిదారులకు రూ.62.50లక్షలు అందించారు.
పంచాయతీరాజ్ శాఖ ద్వారా పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.6.60కోట్లు మంజూరు చేసింది. మిషన్ భగీరథ పథకం ద్వారా రెండు ట్యాంకులు నిర్మించి 1872 కుటుంబాలకు రూ.కోటీ78లక్షలు ఖర్చు చేసి ఇంటింటికి శుద్ధమైన నీటిని సరఫరా చేస్తున్నారు. రూ.కోటీ12లక్షలు వెచ్చించి మిషన్ కాకాతీయ ద్వారా చెరువుల మరమ్మతు చేపట్టారు. మన ఊరు-మనబడికి రూ.34.40లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ శాఖ ద్వారా రూ.22.20లక్షలు వెచ్చించి 220 నూతన విద్యుత్ స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి కరెంటు అంతరాయానికి చెక్పెట్టారు. 113 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.33.62లక్షల వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. రూ.24.50లక్షలతో ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణం, రూ.29.75లక్షలతో పీహెచ్సీ మరమ్మతులు, రూ.20లక్షలతో హెల్త్ సబ్సెంటర్ నిర్మాణం, రూ.10లక్షలతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి దీపాలతో మాక్లూర్ మొత్తం జిగేల్మంటున్నది.
మండల కేంద్రంలో రూ.కోటీ32లక్షలతో సంఘ భవనాలు నిర్మిస్తున్నారు. రూ.25లక్షలతో మైనార్టీలకు షాదీఖాన, రూ,10లక్షలతో చర్చి నిర్మాణం, ఎస్సీ మాదిగ, మాల, దళిత మహిళా భవనం, బాయ్స్ హాస్టల్ మరమ్మతులు, మహిళా భవనం, పశువుల దవాఖాన, యాదవ సంఘం, నాయీబ్రాహ్మణ సంఘం, మహిళా సంఘం బ్యాలెన్స్ వర్క్, నర్సరీ నిర్మాణం, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పల్లెప్రకృతి వనం, రైతు వేదిక, కుమ్మరి సంఘం, ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలు, డంపింగ్యార్డు నిర్మాణం, వైకుంఠధామం తదితరవాటి పనులు పూర్తయ్యాయి.