ఎల్లారెడ్డి రూరల్, మార్చి 23: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. గురువారం ఆయన ఎల్లారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాసంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వర్తింపజేయాలని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేస్తే.. బీజేపీ నాయకుల్లో వణుకు మొదలైందన్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే ఎమ్మెల్యే రాజధానిలో ఉండొద్దని, ప్రజల మధ్య, నియోజకవర్గంలో, మారుమూల గ్రామాల్లో సైతం తిరగాలని కేసీఆర్ తెలిపారని చెప్పారు. ఎటువంటి ఖర్చు, కమీషన్ లేకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరవుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇంటికి పెద్దన్నలా ఆలోచించి పేదింటి ఆడబిడ్డల కుటుంబాలు అప్పులపాలు కావద్దని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థికంగా అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. పారదర్శకంగా, ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్న కేసీఆర్ను రాష్ర్టానికే పరిమితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అష్టకష్టాలు పడుతున్నదన్నారు.
ఆడపడుచు అని చూడకుండా ఎమ్మెల్సీ కవితపై కేసులు బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు.నాగిరెడ్డిపేట్ మండలానికి చెందిన 25మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 26మందికి సీఎంఆర్ఎఫ్, ఐదుగురికి విద్యుత్ ప్రమాద నష్టపరిహార చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కాశీనారాయణ, నాగిరెడ్డిపేట్ జడ్పీటీసీ మనోహర్రెడ్డి, నాగిరెడ్డిపేట్ తహసీల్దార్ సయిద్ అహ్మద్ మస్రూర్, ఆత్మాకూర్ సర్పంచ్ బాల్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.