నిజామాబాద్ రూరల్, జనవరి 7 : పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో 11 ఏండ్ల క్రితం నెలకొల్పిన మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు కాన్షీరాం విగ్రహాన్ని దళితసేన జాతీయ అధ్యక్షుడు జేబీ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని నిర్మించి అందరి ఆదరాభిమానాలు పొందడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహానాయకులను ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో ముందుకు నడుస్తూ సమాజాభివృద్ధి కోసం పాటుపడేందుకు కృషి చేయాలని సూచించారు.
ఎమ్మెల్యేగా గెలిపించిన తనను అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. దళితసేన జాతీయ అధ్యక్షులు జెబి.రాజు మాట్లాడుతూ దేశంలో ఉన్న 85 శాతం బహుజనులందరూ సంఘటితంగా ఏర్పడి రాజ్యాధికారం కోసం పోరాటం చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగిన బీఎస్పీ వ్యవస్థాకులు కాన్షీరాం బాటలో నడవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మాజీ సర్పంచ్, దళిత సంఘం నాయకుడు నీరడి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సభలో కాంగ్రెస్ నాయకులు గడీల రాములు, ముప్ప గంగారెడ్డి, శేఖర్గౌడ్, జ్యోతిబా పూలే, కాన్షీరాం విగ్రహాల కమిటీ అధ్యక్షులు పెద్ద పోశెట్టి, ప్రధాన కార్యదర్శి ఉమ్మెడ రాజేశ్వర్, సాయికుమార్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.