ఖలీల్వాడి, నవంబర్ 15: కటాఫ్ డేట్ లేకుండా కొత్తగా వచ్చిన బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కోరానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించి, రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేస్తామని హామీ ఇచ్చారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తెలిపారు. నిజామాబాద్కు అత్యధిక నిధులు మంజూరుచేసి నగర అభివృద్ధికి సహకరించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యావాదలు తెలిపారు. బుధవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బిగాల మాట్లాడారు. అర్బన్ నియోజక వర్గంలో చాలా మంది మహిళలు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 2014 తర్వాత కొత్తగా వచ్చిన కార్మికులకు కూడా పింఛన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు నిజామాబాద్ నగరం ఎట్లుండెనో.. ఈ పదేండ్లలో ఎంత అభివృద్ధి చెందింతో ప్రజలు గుర్తించాలని సూచించారు. ఎల్లమ్మగుట్ట రైల్వేకమాన్ నగర ప్రజలు ఏండ్లుగా ఎదుర్కొంటున్న వర్షపు నీళ్లు, ట్రాఫిక్జామ్ సమస్యలను శాశ్వతంగా పరిష్క రించేందుకు కొట్లాడి రూ. 20 కోట్లతో బ్రిడ్జి కట్టించామన్నారు.
పాత కలెక్టరేట్, కొత్త కలెక్టర్ ఆఫీస్కు తేడాను గమనించాలన్నారు. మంత్రి కేటీఆర్తోపాటు తన సోదరుడు మహేశ్ బిగాల సహకారంతో నగరానికి ఐటీహబ్ తీసుకువచ్చానని తెలిపారు. ఇటీవల నగరంలో పర్యటించిన సీఎం కేసీఆర్.. పలు అభివృద్ధి పనుల కోసం రూ. 100కోట్లు మంజూరు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. రూ. 56 కోట్లతో నిజామాబాద్ షాన్కు తగినట్లుగా ఇందూరు కళాభారతిని నిర్మిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు నగర అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు, వ్యాపారుల సౌకర్యార్థం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కూడా కట్టాలన్న ఆలోచన చేయలేదన్నారు. ఎక్కడెక్కడ మంచి ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు బాగా అమలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన, ప్రజల ఆత్మగౌరం, హక్కుల కోసమని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించినా ఎలాంటి అభివృద్ధీ చేపట్టలేదని, బీజేపీ ఏం చేసిందో.. వారి చరిత్ర కూడా ప్రజలకు తెలుసని అన్నారు.
ప్రజలు ఓట్లు వేసేటప్పుడు అభ్యర్థుల గుణగణాలు, వారికున్న గౌరవం, అభివృద్ధిపై ఉన్న శ్రద్ధను తప్పకుండా చూడాలని కోరారు. ప్రధానంగా అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్ర, నడవడిక, వారి పార్టీలకు అధికారం కట్టబెట్టినప్పుడు ఏం చేశాయో ఒకసారి ఆలోచించా లన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తవారికి పింఛన్లు ఇస్తామని తెలిపారు. ఆసరా పింఛన్లను రూ. 5వేలకు పెంచ నున్నట్లు చెప్పారు. పదేండ్లలో ఎలాంటి గొడవలూ లేకుండా నగరం ప్రశాంతంగా ఉందని తెలిపారు. ఇదే సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలపించాలని కోరారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సురేశ్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, రాంకిషన్రావు, మేయర్ నీతూకిరణ్, ధర్పల్లి రాజేశ్వర్, వీజీగౌడ్ తదితరులు
పాల్గొన్నారు.