ఖలీల్వాడీ, మే 19: మైనార్టీల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. శుక్రవారం ఆయన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీతో కలిసి జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ టెలిఫోన్ కాలనీలో ఉన్న బైతుల్మాల్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయంలో నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 120 మంది యువతులు, బాలికలకు వృత్తి నైపుణ్య శిక్షణనందించి ఉపాధి కల్పించనున్న నేపథ్యంలో బోధన్ రోడ్డులోని లింక్ కంప్యూటర్ సెంటర్లో యువత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్సులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ మాట్లాడుతూ ..సమాజంలో అన్ని వర్గాల వారి కన్నా మైనార్టీలు ఎంతో వెనుకంజలో ఉన్నారని అన్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రగతి దిశగా పయనింపజేయాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించి మైనార్టీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో గతంలో కేవలం 12 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండగా, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రస్తుతం వాటి సంఖ్య 204కు చేరిందన్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ. లక్షా 20వేల చొప్పు న ఖర్చు చేస్తూ కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు చెప్పారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బైతుల్మాల్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీకి కార్పొరేషన్ ద్వారా కమ్యూనిటీ ప్రొడక్షన్ సెంటర్ను మంజూరు చేస్తున్నామని చైర్మన్ ప్రకటించారు.
అర్బన్ ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ.. మైనార్టీ యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించామని తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపుతానని హామీనిచ్చారు. నగరంలో సుమారు రూ.140 కోట్లు వెచ్చిస్తూ ఏడు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లకు అన్ని వసతులతో పక్కా భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇద్రిస్, కార్పొరేటర్లు షకీల్, ఖుద్దూస్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ జిల్లా జనరల్ మేనేజర్ అబ్దుల్ హమీద్, రెడ్కో సంస్థ మాజీ చైర్మన్ ఎస్ఎ.అలీం, హజ్ కమిటీ సభ్యులు నవీద్, ఇక్బాల్ పాల్గొన్నారు. అంతకుముందు ఆర్అండ్బీ అతిథి గృహంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్కు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మం తు, ఆర్డీవో రవి, మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి రమేశ్, ఏసీపీ కిరణ్కుమార్ తదితరులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.