ధర్పల్లి/ ఇందల్వాయి /సిరికొండ, ఫిబ్రవరి 22 : ఆలయాల నిర్మాణం అందరూ చేస్తారని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సైతం యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని, కానీ బీజేపీ మాత్రం అయోధ్యలో రామమందిరం నిర్మించి ఓట్లను దండుకోవాలని చూస్తున్నదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ధర్పల్లిలోని సబ్స్టేషన్ వద్ద రాంరావ్ మహరాజ్ విగ్రహ 3వ వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహించగా.. ఆయన పాల్గొని పూజలు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని బంజారా సేవా సంఘంలో గిరిజనులు ఎమ్మెల్యేను సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజనులందరికీ పోడు భూములు అందేలా చూస్తామన్నారు. సిరికొండ మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు నిర్వహించగా.. ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. ఇందల్వాయిలోని తిర్మన్పల్లి గ్రామశివారులో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో నూతన గదులు, ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అదనపు గదుల నిర్మాణం కోసం రూ.5 కోట్లు, ప్రహరీ నిర్మాణానికి రూ. 60 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.