మోపాల్ (ఖలీల్వాడి), డిసెంబర్ 25 : క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెలేయ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. యేసుక్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్ పర్వదినంగా ప్రపంచమంతా ఆదివారం జరుపుకొన్న వేళ ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అందరిని ప్రేమించాలి, శాంతిమార్గంలో నడవాలి, సేవాభావంతో మెలగాలన్న క్రీస్తుబోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని మతాలను సమానదృష్టితో చూస్తూ ముఖ్యమైన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రైస్తవుల ఆత్మగౌరవం పెంపొందించేలా హైదరాబాద్లో రెండు ఎకరాల స్థలంలో రూ. 10 కోట్లతో భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారని తెలిపారు. చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఆధునీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని, క్రిస్టియన్ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ రూ. 20 లక్షలు అందిస్తున్నారని వివరించారు.
నవీపేట,డిసెంబర్ 25: సర్వ మతాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. ఆదివారం స్థానిక ఐపీసీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. పాస్టర్ నేహమ్యా ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ద్వారా స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ పంపిన కేక్ కట్చేసి పంపిణీ చేశారు. ఫాస్టర్ నేహమ్యా జడ్పీ చైర్మన్ను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్రావు, సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, నవీపేట సొసైటీ చైర్మన్ అబ్బన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్కుమార్, బుచ్చన్న, నర్సయ్య పాల్గొన్నారు.