డిచ్పల్లి, నవంబర్ 1 : మీరే నా బలం.. నా బలగం అని మీరంతా మరోసారి నన్ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఏకైక బీసీ నాయకుడిని తానేనని మున్నూరుకాపు కులస్తులందరూ ఐక్యంగా తనకు అండగా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తున్నాయని, బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన తనకు మూడోసారి అవకాశం కల్పించారని, నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి గెలిపించాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్ అని ఎన్నో పార్టీలు మారిన వ్యక్తి అని విమర్శించారు. రేవంత్రెడ్డి చెప్పే మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని పిలుపునిచ్చారు. రైతులకు 24గంటల ఉచిత కరెంట్ అందజేస్తుంటే రేవంత్రెడ్డి మూడు గంటలు సరిపోతుందని పేర్కొనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. పదేండ్లుగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి సీఎం కేసీఆర్ సుపరిపాలన సాగిస్తున్నారని గుర్తు చేశారు. అంతకు ముందు మున్నూరుకాపులు ఎమ్మెల్యే బాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్కు నాగలి బహూకరించి, గజమాలతో ఘనంగా సత్కరించారు. నల్లవెల్లి ప్రైవేటు పాఠశాలకు చెందిన చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇందల్వాయి గ్రామానికి చెందిన 4 మున్నూరు కాపు సంఘాలు బాజిరెడ్డి గోవర్దన్కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, మున్నూరుకాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న, జిల్లా అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్మోహన్, జిల్లా నాయకులు పట్వారి లక్ష్మణ్, రమాకాంత్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లిలోని జీ కన్వెన్షన్ హాలులో బుధవారం రాత్రి విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భం గా స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.