డిచ్పల్లి, ఆగస్టు 20 : రూరల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఏడు చెక్డ్యాంల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18 కోట్ల నిధులు మంజూరుచేసినట్లు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆదివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రూరల్ నియోజకవర్గంలో గతంలో 11 చెక్డ్యాంలను నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఏడు చెక్డ్యాంలు మంజూరైనట్లు చెప్పారు. త్వరలోనే రెండు సబ్ సర్ఫెస్ చెక్డ్యామ్లు (రూ.5 కోట్లు) మంజూరు కానున్నట్లు తెలిపారు. మోపాల్ మండలంలోని ఠాణాకుర్దూ వద్ద చెక్డ్యాం నిర్మాణ పనులకు రూ.3.57 కోట్లు, నిజామాబాద్ రూరల్ మండలం కేశాపూర్కు రూ.2.58 కోట్లు, సిరికొండ మండలం తూంపల్లికి రూ.68 లక్షలు, గడ్కోల్కు రూ.2 కోట్ల 46.50 లక్షలు, డిచ్పల్లి మండలం రాంపూర్కు రూ.3.05 కోట్లు, ఇందల్వాయి మండలం గౌరారం వద్ద చెక్డ్యామ్ కోసం రూ.2.55 కోట్లు, నల్లవెల్లికి రూ.3.50 కోట్లు మొత్తం రూ.17.90 కోట్ల నిధులు మంజూరైనట్లు వివరించారు.
ఎన్నికలకు ముందే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి చెక్డ్యాంల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీటి నిర్మాణం పూర్తయితే వాగుల్లో నీరు నిల్వ ఉండి భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. తద్వారా సమీపంలోని గ్రామాల్లో పంటల సాగుకు ఎండాకాలంలో కూడా ఢోకా ఉండబోదన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. సమావేశంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, మాజీ జడ్పీటీసీ సూర్యసురేశ్ తదితరులు పాల్గొన్నారు.