రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నిజామాబాద్ రూరల్, జూలై 15: వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహంలో గల్లంతై మృతి చెందిన వారి కుటుంబీకులకు ఆర్థిక సాయం అందించి అన్నిరకాలుగా ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇటీవల లింగితండా వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువలో మక్కల నడ్పి సాయిలు, ద్యారంగుల రెడ్డి గల్లంతై మృతిచెందగా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు మంజూరవగా, బాధిత కు టుంబ సభ్యులకు బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం చెక్కులను అందజేశారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రెండు కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు.
ద్యారంగుల రెడ్డి కుమారుడు ఐదో తరగతి చదువుతున్నందున గురుకుల పాఠశాలలో చేర్పిస్తామని చెప్పారు. వర్షాల కారణంగా రూరల్ నియోజకవర్గంలో ఇండ్లు కూలిపోయిన బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుచేస్తామన్నారు. వరదలకు ఆయా గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్లు ధ్వంసమవగా, పునరుద్ధరించడానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూ రు చేయిస్తానన్నారు. జక్రాన్పల్లి మండలంలో తొర్లికొండ, కేశ్పల్లి, పడకల్ చెరువులు వరదకు తెగిపోయినందున వాటి మరమ్మతు పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. పంట నష్టం వివరాలను వ్యవసాయాధికారుల ద్వారా తెప్పించుకుని ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు.జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, తహసీల్దార్ అనిల్కుమార్, ఎంపీడీవో మల్లేశ్, వైస్ ఎంపీపీ సాయిలు, టీఆర్ఎ స్ మండల అధ్యక్షుడు మధుకర్రావు పాల్గొన్నారు.
తగిలేపల్లిలో పోచారం సురేందర్రెడ్డి చెక్కు అందజేత
రుద్రూర్ (వర్ని), జూలై 15: వర్ని మండలం తగిలేపల్లిలో రెండు రోజుల క్రితం వర్షాలకు గోడ కూలి మైదం రాజమణి మృతి చెందగా, బాధిత కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. పోచారం సురేందర్రెడ్డి శుక్రవారం చెక్కును బాధిత కుటుంబీకులకు శుక్రవారం అందజేశారు. తహసీల్దార్ విఠల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలాల్ గిరి, సర్పంచ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.