నందిపేట్, మే 14: కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయంతో బీజేపీ ముక్త్ సౌతిండియాగా మారిందని పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కర్ణాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం మొదలైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల మధ్య మతాల చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేస్తున్న కమలనాథుల విద్వేష రాజకీయాలకు కాలం చెల్లిందని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచి, పేద ప్రజల బతుకులను బలి చేస్తున్న ప్రధాని మోదీ డ్రామాలకు శాశ్వతంగా తెర వేయడానికి కర్ణాటక ప్రజలు దేశానికి దిశా నిర్దేశం చేశారని తెలిపారు. దేశంలోని అన్ని చోట్ల బీజేపీ ఖాతాలు క్లోజ్ అవుతాయని, తెలంగాణలో అయితే ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు.
కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఏమాత్రం ఉండదని తెలిపారు. తెలంగాణ గడ్డపై మూడోసారి కూడా బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. కర్ణాటక ఫలితాలపై రేవంత్, బండి సంజయ్లది వింత ధోరణి అని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని పగటి కలలు కంటున్నాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్తో పొత్తు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినవి సిగ్గుమాలిన వ్యాఖ్యలని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు సింగిల్ డిజిట్ కూడా దక్కదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.