గుక్కెడు నీటి కోసం శివారు ప్రాంతాల్లోని బోరు మోటర్ల వద్దకు పరుగులు.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనలు.. నల్లాల వద్ద పంచాయితీలు.. ఇవన్నీ ఒకప్పటి మాట. తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ ఫలాలు ప్రస్తుతం మారుమూల పల్లెలకూ అందుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో తాగునీటి కోసం తండ్లాడిన అన్ని గ్రామాల్లో ప్రస్తుతం శుద్ధ జలాలు సరఫరా అవుతున్నాయి. ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేయడంతో ఆడపడుచుల కష్టాలు దూరమయ్యాయి. ఓ వైపు ఉద్యమంలో పాలుపంచుకుంటూనే మరోవైపు ప్రజల కష్టాలను గుర్తించిన కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇండ్లల్లో నల్లాలు ఏర్పాటు చేసి తాగునీటిని అందించడంపై మహిళలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
సమైక్య పాలకుల హయాంలో గుక్కెడు మంచినీటికి తండ్లాడిన పల్లెలు ప్రస్తుతం శుద్ధమైన నీటిని తాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఉద్యమ సమయంలో మంచినీటి కష్టాలను కండ్లారా చూసిన కేసీఆర్.. తెలంగాణ ఏర్పాటు తర్వాత తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంతో ప్రస్తుతం నదీ జలాలను శుద్ధిచేసి ప్రజలకు అందిస్తున్నారు. జిల్లాలోని ప్రతి పల్లెకు, ప్రతితండాకు స్వచ్ఛమైన తాగునీరు నల్లాల ద్వారా నిరంతరాయంగా అందుతున్నది. మహిళలు బిందెలు పట్టుకొని ఊరి శివారు ప్రాంతాలకు, రోడ్లెక్కి నిరసన తెలిపిన రోజులను రూపుమాపారు. ఇంటి ముందరే తాగునీటిని అందించడంపై మహిళలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
గాంధారి, మే 18: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకంతో తాగునీటి కష్టాలు తొలగాయి. రాష్ట్రం ఏర్పడక ముందు కామారెడ్డి జిల్లాలోని మారుమూల తండాలతోపాటు గ్రామాల్లో తాగునీటి కోసం పడరాని పాట్లు పడేవారు. ఎండకాలం, వానకాలం అనే తేడా లేకుండా నీటి కోసం ఇబ్బందులు పడేవారు. వ్యవసాయ బోరుబావుల నుంచి, వాగుల్లోని చెలిమెల నుంచి తాగేందుకు నీటిని తెచ్చుకునే వారు. అలాంటిది సీఎం కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ పథకంతో ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని 875 గ్రామాలకు, ప్రతి ఇంటికీ నల్లా ద్వారా శుద్ధమైన తాగునీరు సరఫరా అవుతుంది.
ఉమ్మడి రాష్ట్రంలో పలు గ్రామాల్లో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి కుళాయిలు, చేతిపంపుల వద్ద నీటి కోసం మినీయుద్ధాలు(కొట్లాటలు) జరిగేవి. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ప్రకటించిన అనంతరం పనులు పూర్తి చేసి క్రమం తప్పకుండా ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. దీంతో మహిళలు రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండా పోయింది. గడప దగ్గర ఉదయాన్నే నల్లా తిప్పితే జలసిరులు కురుస్తున్నాయి. దీంతో మహిళలు సంతోషపడుతూ..సీఎం కేసీఆర్ పాలనపై హర్షం వ్యక్తంచేస్తున్నారు.
గతంలో నీళ్ల కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. ఇంటింటికీ నల్లా లేకపోవడంతో బోరుబావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు గా పరిస్థితి లేదు. మిషన్ భగీరథ పథకంతో ఇంటి ముందటనే నీళ్లు వస్తున్నాయి. నీటి బాధలు మొత్తం పోయినయ్.
మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతున్నది. ప్రతి ఒక్కరికీ 100 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని 875 గ్రామాలకు, 2680.33 కిలో మీటర్ల మేర అంతర్గత పైప్లైన్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 612 తాగునీటి సరఫరా ట్యాంకులను నూతనంగా నిర్మించారు. 2,50,722 నల్లాల కనెక్షన్లు బిగించారు.
అప్పట్ల నీళ్ల కోసం మస్తు దూరం నడిచేటోళ్లం. నీళ్లకోసం లొల్లి గూడ అయితుండె. అప్పుడప్పుడు పెద్ద పెద్ద పంచాయితీలు అయితుండె . . గిప్పడు ఆ పరిస్థితి లేదు. మొత్తం మారిపోయింది. మా ఊర్లే పొద్దుగాళ్ల లేవంగనే ఇంటి ముందట నల్లాకు నీళ్లు వస్తున్నాయి. దూరం నుంచి నీటిని తీసుకొచ్చే బాధలు పోయినయ్. లొల్లిలు కూడా లేవు.
– బంగారి ఏసుమణి,తిమ్మాపూర్, గాంధారి