రుద్రూర్, మార్చి14: రుద్రూర్ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.20 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్లోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఏటీఎం వెలుపలతోపాటు లోపల ఉన్న సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ పెయింట్ను స్ప్రే చేశారు. అనంతరం లోపలికి చొరబడి ఏటీఎంను బయటికి తీసుకువచ్చి ధ్వంసం చేశారు. అందులో ఉన్న రూ.20 లక్షలను అపహరించుకుపోయారు.
తమ ఫుటేజీ రికార్డు కాకుండా ఏటీఎం ఇరువైపులా ఉన్న సీసీ కెమెరాలకు సైతం బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఏటీఎం సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. దుండగులు వాహనంలో వచ్చి చోరీకి వచ్చినట్లు గుర్తించారు. సీఐ జయేశ్రెడ్డి పరిసర ప్రాంతాలను పరిశీలించి, ఎస్బీఐ అధికారులకు సమాచారం అందించారు. ఏసీపీ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని వివరాల సేకరించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఏసీపీ తెలిపారు.