ఖలీల్వాడి, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదిలేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానం అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువుస్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేయాలన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు జ్యోతిప్రజ్వలన చేసి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జిల్లాస్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 30మందిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మెరుగైన బోధనా సామర్థ్యం, నైపుణ్యాలు కలిగి ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద కుటుంబాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యనందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మన ఊరు – మన బడి కార్యక్రమం కింద కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారన్నారు. జిల్లాలోని సుమారు 150వరకు ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ తరగతి గదులు సమకూరాయన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందిస్తూ సమసమాజ స్థాపనకు మూలకారకులుగా నిలువాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నారని గుర్తుచేశారు.
ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల్లోనూ సానుకూల వైఖరితోనే ప్రభుత్వం వ్యవహరిస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11వేల మంది ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు, 50వేల మందికి బదిలీలు జరగనున్నాయన్నారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ సమాజంలో ఎవరు ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నా గురువు అందించిన తోడ్పాటు, కృషియే కారణమన్నారు. అంకితభావం, నిబద్ధతతో ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తే వారికి తగిన గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుందని, సమాజానికి ఉత్తమ పౌరులను అందించిన వారవుతారన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, విద్యాబుద్ధులు, వినయ విధేయతలు నేర్పించి జీవితంలో నిలదొక్కుకునేలా చేసేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. అందుకే గురువులను దైవంతో సమానంగా భావిస్తారన్నారు. సామాన్య, పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసి ఆదర్శప్రాయులుగా నిలవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీఈవో ఎన్వీ దుర్గాప్రసాద్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.