భీమ్గల్, అక్టోబర్ 4 : బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం తాను ప్రారంభించిన శిలాఫలకాలను లెక్కించేందుకే ప్రతిపక్షాల నాయకులకు ఐదేండ్లు పడుతుందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శిలాఫలకాలపై నంబర్లు వేసుకుంటూ వస్తే ఇప్పటివరకు తాను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. మండలంలో పలు తండాలు, గ్రామాల్లో ఒక్కరోజే రూ. 43కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో ప్రధానంగా రోడ్లు, గోదాములు, రోడ్ డ్యాములు ఉన్నాయి. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నదని తెలిపారు. కొంతమంది అజ్ఞానంతో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులని అసత్యాలు మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ట్యాక్స్ నుంచే తిరిగి నిధులు వస్తాయన్నారు. రూ. 100 చెల్లిస్తే అభివృద్ధి కోసమని 40 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఉదహరించారు.
అవి కూడా స్థానిక ఎమ్మెల్యేలు ప్రపోజల్స్ పెడతారని, విచక్షణాధికారం మేరకు ఏ పనులు పెట్టాలనేది ప్రజల అభీష్టం మేరకు ఎమ్మెల్యే నిర్ణయం ఉంటుందని వివరించారు. కేంద్రం ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని తేల్చి చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాయమాటల మత్తులో పడొద్దని సూచించారు. మంచి, చెడు, అభివృద్ధిపై ఆలోచన చేసే శక్తి యువతకు ఉందని, అభివృద్ధివైపు నిలబడాలని కోరారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అసత్య ఆరోపణలు చేసినా బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ఆగబోదని స్పష్టం చేశారు. మీ అభివృద్ధి కోరుకునే మీ బిడ్డనైనా తనను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. మంత్రి వెంట హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, రైతునాయకుడు కోటపాటి, జడ్పీటీసీ రవి, కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.