బాల్కొండ నియోజకవర్గంలో ఆదివారం కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాల్కొండ మండలం చిట్టాపూర్లో రూ. 149 కోట్లతో లిఫ్ట్ నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. వేల్పూర్ మండలం లక్కోరాలో మసీదుల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. దేశంలోనే నంబర్వన్ సెక్యులర్ లీడర్ సీఎం కేసీఆర్ అన్నారు. మంత్రి వేముల మాట్లాడుతూ అబద్ధాలను నమ్మి మోసపోవద్దని.. కండ్ల ముందు కనిపించే అభివృద్ధిని చూడాలని ప్రజలకు సూచించారు.
-వేల్పూర్/ బాల్కొండ, అక్టోబర్ 1
బాల్కొండ, అక్టోబర్ 1: కాంగ్రెస్ నాయకులు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారని, వారి మాటలు కాకుండా మీ కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూడాలని, మభ్యపెట్టే హామీలతో వచ్చే వారితో రైతులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో రూ.149కోట్లతో 3,500ఎకరాలకు సాగునీళ్లందించే బాల్కొండ, చిట్టాపూర్, సుర్భిర్యాల్ లిఫ్ట్ నిర్మాణ పనులకు మంత్రి వేముల ఆదివారం శంకుస్థాపన చేశారు. తమ చిరకాల వాంఛను తీర్చుతున్న మంత్రికి రైతులు, గ్రామస్తులు గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వయానా రైతు కాబట్టే రైతు కష్టాలు పూర్తిగా తెలుసన్నారు. అందుకే పెట్టుబడిసాయం, 24 గంటల ఉచిత కరెంట్, సాగునీటి గోస తీర్చి రైతుకు భరోసాగా నిలిచారన్నారు. నాడు బీడు భూములతో దిగులుగా ఉన్న రైతు, నేడు కేసీఆర్ వల్ల పచ్చని పైరులతో ముఖం మీద చిరునవ్వుతో ఉన్నాడని తెలిపారు.
నియోజకవర్గంలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గుత్ప, చౌట్పల్లి హన్మంత్రెడ్డి, లక్ష్మీ లిఫ్ట్ ద్వారా చెరువులు నింపుకొంటున్నామని, దీంతో వేసవికాలంలో కూడా చెరువులు నిండుకుండలా ఉన్నాయని తెలిపారు. 300కిలోమీటర్ల కింద నుంచి కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీకి ఎదురెక్కించిన ఘనత కేసీఆర్దేనన్నారు. చిట్టాపూర్ లిఫ్ట్ ద్వారా 3,500 ఎకరాలకు సాగునీటి సౌలభ్యం కానున్నదని, అందులో చిట్టాపూర్ 2వేల ఎకరాలు, బాల్కొండ 1240 ఎకరాలు, శ్రీరాంపూర్ 282 ఎకరాలకు కొత్తగా లిఫ్ట్ ద్వారా సాగునీరు అందనున్నదన్నారు. బాల్కొండ రైతులు సాగునీటి కోసం రోడ్ల మీద ధర్నాలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను అరిగోస పెట్టి, ఇప్పుడు రైతులను ఆదుకుంటామని హామీలిస్తున్నారని, వారిని నమ్మితే మళ్లీ పాత రోజులే, పాత గోసలేనని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వనజాగోవర్ధన్గౌడ్, ఎంపీపీ లావణ్యాలింగాగౌడ్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, కోటపాటి నర్సింహనాయుడు, ఇరిగేషన్ సీఈ మధుసూదన్, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు తదితరులు పాల్గొన్నారు.