బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఆనందోత్సాహాల నడుమ సాగుతున్నాయి. మంగళవారం మోర్తాడ్, జుక్కల్, తాడ్వాయి మండలాల్లో నిర్వహించిన సమ్మేళనాలకు కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని వివరించిన ఎమ్మెల్యేలు.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మోర్తాడ్లో జరిగిన కార్యక్రమానికి సతీమణితో సహా హాజరైన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అనుచరులను ఆప్యాయంగా పలుకరించారు. తాడ్వాయి, జుక్కల్ మండలాల్లో జరిగిన సమ్మేళనాల్లో ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, షిండే పాల్గొన్నారు.
– మోర్తాడ్/నిజాంసాగర్/తాడ్వాయి, మార్చి 28
మోర్తాడ్, మార్చి 28: ఎంపీ అర్వింద్ కుటుంబానికి పసుపు రైతుల ఉసురు తగిలిందని, ఎంపీ వైఖరితో ఒకవైపు కన్నవారికి, మరోవైపు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మనశ్శాంతి కరువయ్యిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఫ్యామిలీ వార్తో పెద్దాయన, డి.శ్రీనివాస్ పరిస్థితి చూస్తే బాధనిపిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. మోర్తాడ్ మండలంలోని ఆర్ఎన్బీ ఫంక్ష న్ హాల్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు.
ఐదు రోజు ల్లో పసుపు బోర్డు తెస్తానని, మద్దతు ధర ఇప్పిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి ఐదేండ్లు కావొస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని, అర్వింద్కు విలువ పోయింది కానీ, బాండ్ పేపర్ విలువ కూ డా తీసేసినట్లు అయ్యిందన్నారు. ఎంపీగా ఎన్ని నిధులు తీసుకొచ్చావు.. మోర్తాడ్లో ఎన్ని కులసంఘాలకు నిధులు తెచ్చావు..ఎంతమందికి ప్రధానమంత్రి సహాయనిధి ఇప్పించావని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీకి అదానీ పెద్దదోస్తు అని, ఆయనకు సంబంధించిన 12లక్షల కోట్ల మాఫీ గురించి, ప్రజల డబ్బు ఉండే ఎల్ఐసీ, ఎస్బీఐలకు అదానీ వల్ల జరిగిన నష్టాలపై విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేయడంతోనే తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కవితపై తప్పుడు కేసు…
అదానీ, మోదీల అవినీతిని ప్రశ్నించినందుకే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసు పెట్టి సతాయిస్తున్నారని మంత్రి అన్నారు. వందకోట్లు ఎవరు తీసుకున్నారో ఇంకా తేలనేలేదు, అలాంటిది కవితను విచారణ పేరిట పొద్దున పిలిచి రాత్రి వరకు ఉంచుతున్నారని తెలిపారు. మరి ఎల్ఐసీకి సంబంధించి 60వేల కోట్లు, ఎస్బీఐకి సంబంధించి 70వేల కోట్లు నష్టం జరిగిందని తేలినా అదానీపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని, విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో అవినీతి మీద ప్రశ్నిస్తేనే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పుడు నేను మాట్లాడుతున్నందుకు రేపు నామీద కూడా కేసు వేస్తారని.. ఇంత దౌర్భాగ్యపు రాజకీయాలు చూడలేదన్నారు. రేవంత్, బండి సంజయ్లు బట్టే బాజ్లు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా 90వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని ఇందులో ఇప్పటికే కొన్నింటిని భర్తీ చేశామని మంత్రి చెప్పారు. అయితే గ్రూప్-1కు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ చేసిన వారిని విచారించి జైలుకు పంపించామని, అయితే మంత్రి కేటీఆర్ పీఏ పాత్ర ఉందని బట్టేబాజ్ మాటలు మాట్లాడారని, అసలేం జరిగిందనేది ఫోన్లో వీడియో ద్వారా సమావేశంలో వినిపించారు.
జగిత్యాల జిల్లాలో ఒక్కరికే వందకుపైగా మార్కులు వచ్చాయన్నది నిజమని, కానీ రేవంత్రెడ్డి, బండిసంజయ్లు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా యువత, ప్రజలు మేల్కొనాలని కేసీఆర్ కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ పరీక్షలు రాసేవారి కోసం ఆన్లైన్లో సబ్జెక్ట్లు పంపే ప్రయత్నాలు చేస్తున్నామని, పిచ్చికూతలు కూసే వారి మాటలు పట్టించుకోకుండా ప్రిపేర్ కావాలని కోరారు.
తెలంగాణ వచ్చాకే గ్రామాల అభివృద్ధి..
తెలంగాణ వచ్చిన తర్వాతే గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్న విషయం ప్రజలందరూ గుర్తించారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, జిల్లా ఇన్చార్జి బండ ప్రకాశ్ అన్నారు. సీఎంకు మంత్రి ప్రశాంత్రెడ్డి ఎంతో విశ్వాసపాత్రుడని అందుకే బాల్కొండ నియోజకవర్గం బాద్షాలా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెప్పారు. బాల్కొండలో అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడితే బండెక్కించుకొని తిప్పితే వారి నోట మాటరాదని అన్నారు. హైదరాబాద్లో సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం నిర్మాణాలు వేముల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, సీఎంకు ఎంత ఆత్మీయంగా ఉంటాడో ఈ విషయాలతో తెలుస్తుందన్నారు. ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్స దేవన్న, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్, సర్పంచ్ బోగ ధరణి, సత్యనారాయణ, దడివె నవీన్, గంగారెడ్డి, కోటపాటి నరసింహనాయుడు, డాక్టర్ మధుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రెండు పంటలు పండించుకుంటున్నం
ఇంతకుముందు నీళ్లు లేక ఇబ్బందులు వడ్డం. తెలంగాణ అచ్చినంక సెర్లు నింపుతుండ్రు. కాల్వల్ల నీళ్లస్తున్నయి. రెండు పంటలు పండించుకోగలుగుతున్నం. పంటలు పండించుకునుట్ల మంచిగ బతకగలుగుతున్నం. ఇంట్లందరం సంతోషంగా ఉంటు న్నం. మాకు గిట్లనే నీళ్లిచ్చి, రెండుపంటలు పండించుకునేలా చేసిన కేసీఆర్ సల్లంగ ఉండాలే.
– బొర్రవ్వ, వడ్యాట్
సీఎంకు రైట్ హ్యాండ్ అంటారు..
ఎక్కడికి వెళ్లినా మంత్రి ప్రశాంత్రెడ్డి పేరు చెప్పగానే సీఎంకు రైట్హ్యాండ్ అని అంటారు, నాయకులుగా ఇది మాకు ఎంతగానో సంతోషాన్నిస్తుంది. మంత్రి స్వతహాగా ఇంజినీరు కావడం, మాకు ఏం కావాలో తెలుసుకొని పనులు చేయిస్తరు. ప్రజల కోసం తపించే నిస్వార్థ నాయకుడిని చూడడం ఇదే మొదటిసారి. ఈసారి లక్ష మెజార్టీతో గెలువడం ఖాయం.