వేల్పూర్, నవంబర్ 5 : కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ మాయమశ్చీంద్ర మాటలేనని, అవి విని మోసపోవద్దని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రజలకు సూచించారు. వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ, కొత్తపల్లి, వాడి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా గ్రామాల్లో వలగొడుగులు, బోనాలతో రైతులు, మహిళలు, గ్రామప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ మాయ మాటలేనని, దానికి నిదర్శనం కర్ణాటకలో మోసపోయిన ప్రజలేనని పేర్కొన్నారు. కర్ణాటకలో గెలిస్తే ఏడు గంటల కరెంట్ను పది గంటలకు పెంచుతామని హామీనిచ్చి, ఉన్న ఏడు గంటల్లో ఐదు గం టలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. పొద్దున, రాత్రి కరెంట్ ఇస్తూ మళ్లీ పాతరోజులను కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలకు వచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాక ముందు పదేండ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అప్పుడెందుకు ఈ పథకాలన్నీ అమలుచేయలేదని వేముల ప్రశ్నించారు.
దేశంలో మరో నాలుగు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ చేసిందేమీలేదన్నారు. ప్రధాని మోదీ గ్యాస్ ధరను పన్నెండు వందలకు పెంచాడని, ఇంకా పెంచుతాడని, ఎంత పెంచినా కేసీఆర్ మాత్రం రూ.400 లకే సిలిండర్ ఇప్పించి, మిగిలిన భారాన్ని భరిస్తాడని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మానవీయ కోణంలో కేసీఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని చెప్పారు. భూమి లేని వారింట్లో కూడా కుటుంబ పెద్ద మరణిస్తే బీమా కింద ఐదు లక్షల రూపాయలిచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుపై సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. పింఛన్ రూ.3 వేలకు పెంచి ప్రతి యేడాది ఐదు వందల చొప్పున పెంచుతూ ఐదు వేల పింఛన్ అందిస్తారన్నారు. కొత్త బీడీ పీఎఫ్ వచ్చిన వారికి కూడా బీడీ పింఛన్ కోసం సీఎం కేసీఆర్కు విన్నవిస్తే ఒప్పుకున్నారని తెలిపారు. కొత్తపల్లి, చింతలూర్ మీదుగా డబుల్ రోడ్డు వేయించానని, వాగుల్లో చెక్డ్యామ్లు నిర్మించానని మంత్రి తెలిపారు. ప్రచారంలో ఆయా గ్రామాల సర్పంచులు ఏనుగు శ్వేతా గంగారెడ్డి, నితీశ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, కోటపాటి నర్సింహనాయుడు, డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, అంక్సాపూర్ రాజేందర్రెడ్డి, మిట్టాపల్లి మహిపాల్, నల్ల రమేశ్, ఏనుగు గంగారెడ్డి, సొసైటీ చైర్మన్ లింబారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
చెరువుల్లో నీళ్లు లేక పంటలు పండడం లేదని, గ్రామస్తులు బాధపడితే సైకిల్ మోటరుపై వెళ్లి చెరువులను, పంట పొలాలను పరిశీలించానని తెలిపారు. పరిష్కారం కోసం చింతలూర్ వద్ద వాగులో చెక్డ్యామ్ నిర్మించి గేటు ఏర్పాటు చేసి వరద పచ్చలనడ్కుడ చెరువులోకి వచ్చేలా చేశానన్నారు. దీంతో చెరువులోకి ఇప్పటికీ నీళ్లు వస్తున్నాయని తెలిపారు. చెరువు ఆయకట్టుకాకుండా వాగు ఆయకట్టు రైతులకు కూడా సాగునీటి ఇబ్బందిని తీర్చేందుకు పచ్చలనడ్కుడ వైపు ఒక చెక్డ్యాం, కిందివైపు మరొక చెక్డ్యాం నిర్మించామని, దీంతో గ్రామంలో సాగునీటికి ఢోకా లేకుండా పోయి రెండు, మూడు పంటలు పండిస్తున్నారని వివరించారు. నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా సాగునీరు లేక ఎండిపోకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీ 21తో ఎస్సారెస్పీకి దూరంగా ఉన్న వేల్పూర్ మండలంలోని పలు గ్రామాలు, భీమ్గల్ మండలం, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల గ్రామాలకు సాగునీటి ఇబ్బందులు తీరిపోతాయన్నారు. మనం చేసిన పనులతో పది తరాలు బతికి బాగుపడాలనేదే తన తపన అని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి అన్ని నిత్యావసరాల ధరలు పెరిగేందుకు బీజేపీ కారణమైందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గరీబోళ్లకు మేలు చేయదన్నారు. వాడి, కొత్తపల్లి గ్రామానికి కలిపి సబ్స్టేషన్ మంజూరు చేయిస్తానని గ్రామస్తులకు మంత్రి హామీ ఇచ్చారు.