వేల్పూర్, ఫిబ్రవరి 17 : ఎర్రజొన్న రైతులను నష్టపరిచే సీడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. ఎర్రజొన్న పంటకు గిట్టుబాటు ధర రాకుండా సీడ్ వ్యాపారులు సిండికేట్గా మారే ప్రయత్నాలు చేస్తున్నారని పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై మంత్రి స్పందించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు ఫోన్ చేసి ఎర్రజొన్న రైతులు నష్టపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ పరిధిలో అధిక విస్తీర్ణంలో రైతులు ఎర్రజొన్న పంట సాగు చేస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా చూడాలన్నారు.
ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, బైబ్యాక్ ఒప్పందం ప్రకారమే ఎర్రజొన్నలు కొనుగోలు చేసేలా గట్టి పర్యవేక్షణ జరుపాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులతో తక్షణమే సమావేశమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు.